రగిలిన ప్రతీకారం.. | - | Sakshi
Sakshi News home page

రగిలిన ప్రతీకారం..

May 7 2025 12:40 AM | Updated on May 7 2025 12:46 AM

కాటారం : భూ వివాదంలో అయిన వారే తన తండ్రిని కిరాతకంగా హతమార్చడంతో ఓ యువకుడు ప్రతీకారం పెంచుకున్నాడు. ఎలాగైనా వారిని అంతమొందించాలని నిర్ణయించుకొని సమయం కోసం వేచి చూశాడు. నిందితుల్లో ఇద్దరు మహిళ, ఆమె కుమారుడు రోడ్డుపై కనబడటంతో ఒక్కసారిగా గొడ్డలితో వారిపై దాడికి పాల్పడిన సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాటారం మండలం దేవరాంపల్లికి చెందిన మారుపాక సారయ్యను ఐదు గుంటల భూ వివాదంలో అతడి తమ్ముడు సమ్మయ్య, మరో తమ్ముడి భార్య మారుపాక లక్ష్మి, ఆమె కుమారుడు కిరణ్‌, మరో ఇద్దరు గతేడాది డిసెంబర్‌ 14న కంట్లో కారం చల్లి గొడ్డలితో నరికి చంపారు. ఈ కేసులో మారుపాక సమ్మయ్య, లక్ష్మి, మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా ఇటీవల లక్ష్మి, కిరణ్‌ కండీషన్‌ బెయిల్‌పై విడుదల కాగా ప్రతి మంగళవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి సంతకం చేయాల్సి ఉంది. అందులో భాగంగా లక్ష్మి, ఆమె కుమారుడు కిరణ్‌ మంగళవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వస్తుండగా అవకాశం కోసం వేచి ఉన్న మృతుడు సారయ్య చిన్న కుమారుడు మారుపాక అంజి ఒక్కసారిగా లక్ష్మిపై గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. పక్కనే ఉన్న కిరణ్‌ ప్రాణభయంతో పారిపోయాడు. గమనించిన స్థానికులు అంజిని అడ్డుకోగా అప్పటికే లక్ష్మి తీవ్ర గాయాలపాలైంది. చికిత్స నిమిత్తం భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. నిందితుడు అంజిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. లక్ష్మి కుమారుడు కిరణ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పీఎస్సై గీతారాథోడ్‌ పేర్కొన్నారు.

తండ్రి హత్య కేసులో నిందితురాలిపై గొడ్డలితో యువకుడి దాడి

కాటారం పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో ఘటన

రగిలిన ప్రతీకారం..1
1/1

రగిలిన ప్రతీకారం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement