
ప్రజారోగ్య పరిరక్షణకు కృషి చేయాలి
తొర్రూరు: ప్రజారోగ్య పరిరక్షణకు ఆరోగ్య సిబ్బంది కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ సుధీర్రెడ్డి అన్నారు. డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం ఆశకార్యకర్తలు, ఆరోగ్యసిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ సుగుణాకర్రాజు, మండల వైద్యాధికారి జ్వలితతో కలిసి డిప్యూటీ డీఎంహెచ్ఓ మాట్లాడారు. ప్రతి మహిళ ప్రసవం ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగేలా ఆశకార్యకర్తలు కృషి చేయాలన్నారు. గర్భిణులు, బాలింతలు, శిశువులకు గడువులోగా వైద్యం అందేలా చూడాలన్నారు. బీపీ, షుగర్ బాధితులకు నెలవారి మాత్రలు విధిగా అందించాలని కోరారు. వేసవిలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో వైద్యులు మీరాజ్, మానస, ప్రియాంక, నందన, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.