
ప్రభుత్వానికి రైతుల గోస పట్టదా?
మహబూబాబాద్ రూరల్: కొనుగోలు కేంద్రాల్లో రైతులు గోసపడుతున్నారని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు అన్నారు. మహబూబాబాద్ మండలం ముడుపుగల్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ స్థానిక రైతులతో మాట్లాడి ధాన్యం కొనుగోలు కేంద్రంలో వారు పడుతున్న ఇబ్బందులు, సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. ఐకేపీ అధికారులు, కొనుగోలు కేంద్రం నిర్వాహకులతో మాట్లాడారు. అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారికి ఫోన్ చేసి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులను తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్సీ రవీందర్ రావు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, కాంటాలు పెట్టడం, ధాన్యం తరలింపు చూస్తుంటే ప్రభుత్వం కాంట్రాక్టర్లతో సెటిల్మెంట్ చేసుకున్నట్లు ఉందని ఆరోపించారు. గన్నీబ్యాగులు అందుబాటులో లేవని, కొనుగోళ్లు, తూకాలు, లారీల్లో తరలించడంలో జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు గోసపడుతుంటే స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యం కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ జేరిపోతుల వెంకన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, బీఆర్ఎస్ నేతలు బాషికాల అంబరీష, మంగళంపల్లి కన్నా, దౌలాగర్ శంకర్, అంబాల శివ, కర్పూరపు గోపి, మార్నేని కిరణ్ కుమార్, రైతులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు