
హనుమాన్ దీక్ష.. సర్వ జగద్రక్ష
ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్యం
కాజీపేటలో కొలువుదీరిన ఆంజనేయస్వామి
● భక్తిశ్రద్ధలతో హనుమాన్ దీక్షలు
● ఈ నెల 22న హనుమాన్ జయంతి
కాజీపేట : అత్యంత భక్తిశ్రద్ధలు, కఠోర నియమాలతో చేపట్టే దీక్షల్లో హనుమాన్ దీక్ష ఒకటి. పురాణ కాలాల్లోనూ పలువురు ఈ దీక్షను ఆచరించినట్లుగా ఇతిహాసాలు చెబుతున్నాయి. ట్రైసిటీలో ఒకటిగా పేరొందిన కాజీపేట పట్టణంలో దక్షిణ ముఖంగా వెలిసిన అభయాంజనేయ స్వామి ప్రముఖ క్షేత్రం హనుమాన్ దీక్షలకు ప్రసిద్ధి గాంచింది. సుమారు 40 ఏళ్లుగా భక్తులు ఇక్కడ దీక్షలు తీసుకున్న స్వాములు కొండగట్టు ఆంజనేయుడు, భద్రాచల రామచంద్ర స్వామి దర్శనం కోసం తరలి వెళ్తుంటారు. 41 రోజుల పాటు మండల దీక్షలు, 21 రోజుల అర్ధ మండల దీక్షలు, 16 రోజులు, 11 రోజుల దీక్షలను ఈ ఆలయంలో స్వీకరిస్తారు.
శ్రీరాముడు స్వీకరించిన దీక్ష ఇదే..
హనుమద్ దీక్ష గొప్పతనాన్ని అభయాంజనేయ స్వామి ఆలయ ప్రధానార్చకుడు జాగర్లపూడి శ్రీనివాస్ శర్మ వివరించారు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి సీత అన్వేషణలో భాగంగా మూడ్రోజులపాటు ఆంజనేయస్వామి దీక్ష చేపట్టినట్లు పురాణాలు చెబుతున్నాయని వివరించారు. ఏటా వైశాఖ మాస కృష్ణపక్ష దశమి పూర్వాభద్ర నక్షత్రం రోజున హనుమాన్ జయంతి నిర్వహిస్తుంటారు. దీన్ని పురస్కరించుకుని భక్తులు హనుమాన్ దీక్షలు చేపడుతున్నారు. ఈ ఏడాది లక్ష తమలపాకుల పూజతో హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. దీక్షలు పూర్తయిన రోజున కపిబంధనోత్సవం నిర్వహిస్తారు. మహా పూర్ణాహుతి (శాంతిహోమం)తో దీక్షలు ముగుస్తాయి.
రెండు రకాల దీక్షలు
రాష్ట్రవ్యాప్తంగా పలువురు భక్తులు హనుమాన్ దీక్షలు చేపడుతున్నారు. హనుమాన్ విజయోత్సవ వేడుకలను పురస్కరించుకుని దీక్షలు తీసుకోవడం ప్రారంభమైంది. 41 రోజుల దీక్షలు, 21 రోజుల అర్ధ మండల దీక్షలను చేపట్టిన భక్తులు కఠిన నియమాలను పాటిస్తున్నారు. వేకువజామున నిద్రలేవడం, తల స్నానం చేయడం, భజనలు, పేట తుళ్లి నృత్యాల ద్వారా శారీరక ఆరోగ్యం చేకూరుతుందని దీక్షదారులు చెబుతున్నారు. ఈ నెల 14న కొండగట్టు ఆలయంలో జరిగే మహా పూర్ణాహుతిలో దీక్షదారులు ఇరుముడులు సమర్పించడంతో దీక్షలు పరి సమాప్తమవుతాయి.

హనుమాన్ దీక్ష.. సర్వ జగద్రక్ష