
‘సోలార్’పై విముఖత
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా..
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 889.7 మెగావాట్లకు సరిపడా 682 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 210.6 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు 162 మంది రూ.లక్ష చొప్పున ఈఎండీ చెల్లించారు. 177.1 మెగావాట్లకు గాను 141 మందికి లెటర్ ఆఫ్ ఆక్సెప్టెనీ ఇచ్చారు. ఇంకా 520 మంది రైతులు సోలార్ ప్లాంట్ ఏర్పాటుపై విముఖతతో ఉన్నారు. దరఖాస్తు స్వీకరించడానికి గడువు పొడిగించిన ఆశించిన మేరకు దరఖాస్తులు రాలేదు. అదే విధంగా ఈఎండీ చెల్లించేందుకు దరఖాస్తులు ముందుకు రావడం లేదు.
రుణాలపై స్పష్టత ఇవ్వని బ్యాంకర్లు
● ఈఎండీ చెల్లించేందుకు ముందుకురాని రైతులు
● ఉమ్మడి జిల్లాలో 682 దరఖాస్తులు
● ఈఎండీలు చెల్లించినది 162.. ముందుకు రాని వారు 520 మంది
హన్మకొండ : భారీ పెట్టుబడి.. గిట్టుబాటు కానీ ధర.. 12ఏళ్ల వరకు రైతుకు ప్రయోజనం లేకపోవడం.. రుణంపై బ్యాంకర్లకు స్పష్టత లేక పోవడం.. రైతు వాటాగా రూ.లక్షల్లో చెల్లించాల్సి రావడం.. ప్రతినెల ఆదాయం నిలకడగా వస్తుందనే నమ్మకం లేకపోవడం వెరసి సోలార్ ప్లాంట్ ఏర్పాటుపై రైతుల్లో తీవ్ర విముఖత వ్యక్తమవుతోంది. దరఖాస్తు చేసినప్పటి ఉత్సాహం ఈఎండీ చెల్లించడంలో రైతులు ఆసక్తి చూపడం లేదు. దీంతో పీఎం కుసుం పథకం ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. దరఖాస్తుల స్వీకరణకు మూడు సార్లు గడువు పొడిగించింది. ఇప్పుడు ఈఎండీలు చెల్లించడానికి రెండు సార్లు గడువు విధించింది. అయినా ఈఎండీలు చెల్లించడానికి రైతులు ముందుకు రావడం లేదు. దీంతో ఈ పథకం ఆశించిన మేర సఫలం కాలేక పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అమలు
కేంద్ర ప్రభుత్వం సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు, సోలార్ ప్లాంట్ ఏర్పాటుపై రైతులను ప్రోత్సహించేందుకు ప్రధాన మంత్రి కిసాన్ ఉర్జా సురక్షా ఎవం ఉత్థాన్ మహాభియాన్ (పీఎం కుసుం) పథకాన్ని తీసుకు వచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ, టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. రైతులతో పాటు మహిళా స్వయం సహాయక సంఘాలు, రైతు ఉత్పత్తి సంఘాలు, సహకార సంఘాలు, పంచాయతీలు, నీటి వినియోగదారుల సంఘాలు సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు పథకాన్ని రూపొందించారు. ఉత్పత్తి చేసిన విద్యుత్ను స్థానిక డిస్కంలు ముందుగా నిర్ణయించిన టారిఫ్ ధరలకు కొనుగోలు చేస్తాయి. సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు స్థలం 33/11 కేవీ సబ్ స్టేషన్కు ఐదు కిలోమీటర్ల లోపు దూరం మాత్రమే ఉండాలి. 500 కిలో వాట్ల నుంచి 2 మెగావాట్ల ఉత్పత్తి వరకు సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చు.
సోలార్ ప్లాంట్పై అవగాహన లేకనే..
ఒక మెగావాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్కు రూ.3 కోట్ల ఖర్చు అవుతుంది. ఇందులో రైతులు తమ వాటాగా 25 శాతం భరిస్తే, బ్యాంకుల ద్వారా 75 శాతం రుణ సదుపాయాన్ని కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది. కొన్ని బ్యాంకులకు సోలార్ ప్లాంట్పై అవగాహన లేదన్నారు. కనీసం 25 శాతం కింద రూ.3 కోట్ల వ్యయంలో రైతు వాటాగా రూ.75 లక్షలు భరించలేమని, అదే విధంగా ప్రభుత్వం యూనిట్కు చెల్లిస్తామని చెప్పిన రూ.3.13లు ఏటు సరిపోవన్నారు. 12 ఏళ్ల వరకు రుణ వాయిదాలు చెల్లించాల్సి రావడంతో అప్పటి వరకు రైతుకు ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదని వాపోయారు. దీంతో తాము నష్టపోతున్నట్లు చెబుతున్నారు.
లాభదాయకంగా లేదు..
మా నాన్న పేరుపై వ్యవసాయ భూమి ఉంది. పీఎం కుసుం పథకం ద్వారా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేద్దామని దరఖాస్తు చేశాం. యూనిట్ ధర చూస్తే ఏ మాత్రం లాభదాయకంగా లేదు. బ్యాంకర్లు రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. 25 ఏళ్ల వరకు యూనిట్కు రూ.3.13 మాత్రమే చెల్లిస్తుండడం ఏ మాత్రం ప్రయోజనం కాదు. ఇతర రాష్ట్రాల్లో యూనిట్కు రూ.4 నుంచి రూ.4.50 వరకు చెల్లిస్తున్నారు. 14, 15 సంవత్సరాల వరకు వచ్చే ఆదాయం వాయిదాలకే వెళ్తుంది. తర్వాతే రైతు చేతికి ఆదాయం వస్తుంది. అప్పటి వరకు పరిస్థితిలు ఎలా ఉంటాయోనని ఈఎండీ చెల్లించలేదు.
– పెసరు కార్తీక్ రెడ్డి, సూదనపల్లి, హనుమకొండ
జిల్లాల వారీగా వివరాలు..
జిల్లా వచ్చిన ఈఎండీ ఎల్ఓఏ
దరఖాస్తులు–మెగావాట్లు చెల్లింపు–మెగావాట్లు జారీ–మెగావాట్లు
హనుమకొండ 76 95.2 26 33.2 24 29.2
జేఎస్ భూపాలపల్లి 116 138.8 19 22.8 19 22.8
జనగామ 179 243.2 51 66 41 52
మహబూబాబాద్ 127 177.3 41 57.6 33 43.6
ములుగు 50 70.2 5 5 4 4
వరంగల్ 134 265 20 26 20 25.5

‘సోలార్’పై విముఖత