
పురుడు కార్యం.. ప్రాణం తీసింది
● భర్త వేధింపులకు బాలింత ఆత్మహత్య
చిట్యాల : భర్త వేధింపులు తట్టుకోలేక మనస్తాపం చెందిన బాలింత ముదిగొండ నిరోషా (26) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని ముచినిపర్తిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ముచినిపర్తికి చెందిన కందికొండ నిరోషాను వరంగల్ జిల్లా దేశాయిపేటకు చెందిన ముదిగొండ ప్రశాంత్తో గతేడాది వివాహం కాగా వీరికి పాప జన్మించింది. ఈక్రమంలో పాపకు 11వ రోజు పురుడు చేయాలని భర్త ప్రశాంత్, అత్త లక్ష్మి గత నెల 30న నిరోషా వద్దకు వచ్చారు. దీంతో ప్రశాంత్ మామ శంకర్ తమ వంశంలో పురుడు చేసేది లేదని చెప్పాడు. అయితే మేమే పురుడు చేసుకుంటామని రూ.లక్ష అదనంగా ఇవ్వమని అల్లుడు అడగ్గా తమ దగ్గర అంత డబ్బులు లేవని చెప్పాడు. దీంతో అల్లుడు, అతడి తల్లి గొడవపడి వెళ్లిపోయారు. ఆదివారం ప్రశాంత్..నిరోషాతో ఫోన్లో ఏం మాట్లాడాడో తెలియదని, మనస్తాపం చెంది ఇంట్లో పురుగుల మందు తాగిందని తెలిపారు. కుటుంబ సభ్యులు వెంటనే సివిల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందినట్లు వారు చెప్పారు. అల్లుడు ప్రశాంత్, అతడి తల్లి లక్ష్మి, తండ్రి సాంబయ్యల ఒత్తిడి మూలంగానే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతిరాలి తండ్రి శంకర్ సోమవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రెయినింగ్ ఎస్సై హేమ పేర్కొన్నారు.
ప్లాట్ విక్రయించేందుకు వెళ్లి..
● బైక్ను ఢీకొన్న కారు ● చెల్లెలు మృతి, అన్నకు గాయాలు
రఘునాథపల్లి : హనుమకొండ–హైదరాబాద్ జాతీయ రహదారిపై గోవర్దనగిరి దర్గా సమీపంలో బైక్ను వెనకనుంచి కారు వేగంగా ఢీకొట్టడంతో చెల్లెలు మృతి చెందగా అన్న గాయపడిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. స్టేషన్ఘన్పూర్ మండలం చాగల్లు గ్రామానికి చెందిన మట్టెవాడ విజయ (45) భర్త చనిపోవడంతో పిల్లలతో కలిసి హైదరాబాద్లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తోంది. గ్రామంలోని స్థలాన్ని (ప్లాట్) విక్రయించేందుకు తల్లిగారి గ్రామం కోమల్లకు వెళ్లి సోదరుడు గాదె లింగస్వామితో ద్విచక్రవాహనంపై చాగల్లుకు బయలుదేరింది. అక్కడ పనులు ముగించుకొని తిరిగి సోదరుడి బైక్పై పుట్టింటికి వస్తుండగా గోవర్దనగిరి దర్గా సమీపంలో వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు అతి వేగంగా వెళ్తున్న కారు వీరి బైక్ను ఢీకొట్టింది. దీంతో వెనకాల కూర్చున్న విజయ ఎగిరి రోడ్డుపై పడటంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సోదరుడు లింగస్వామికి గాయాలు కాగా స్థానికులు జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జనగామ రూరల్ సీఐ ఎడవెల్లి శ్రీనివాస్రెడ్డి, ఎస్సై దూదిమెట్ల నరేష్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

పురుడు కార్యం.. ప్రాణం తీసింది