
రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి
మహబూబాబాద్ రూరల్ : రైతులు తమ పంటల సాగుతో రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి, పంట మార్పిడి చేసి, పర్యావరణ పరిరక్షణకు చెట్లను పెంచాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.విజయనిర్మల, మల్యాల కేవీకే సమన్వయకర్త డాక్టర్ ఎస్.మాలతి పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ, మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. యూరియా వాడకాన్ని వీలైనంత తక్కువగా చేపట్టాలని, తద్వారా పెట్టుబడిని తగ్గించుకుని నేల ఆరోగ్యాన్ని కాపాడాలని సూచించారు. జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమల అధికారి మరియన్న మాట్లాడుతూ వాణిజ్య పంటలతో పాటు ఆయిల్పామ్, కూరగాయల సాగుపై దృష్టి కేంద్రీకరించాలని పేర్కొన్నారు. మల్యాల కేవీకే శాస్త్రవేత్త బి.క్రాంతికుమార్ మాట్లాడుతూ ముఖ్యంగా పచ్చిరొట్ట పంటల సాగు, మట్టి పరీక్షలు చేయించడం, జీవన ఎరువులు వాడడం, వానాకాలం సాగు చేసే పంటల్లో రకాలు, యాజమాన్య పద్ధతుల గురించి వివరించారు. ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఈ.రాంబాబు మాట్లాడుతూ మిర్చి సాగు తగ్గించుకుని ఇతర కూరగాయల పంటలు సాగు చేయాలని సూచించారు. విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.కిషోర్ కుమార్ మాట్లాడుతూ పప్పు, నూనె గింజ పంటల సాగు, వాటి రకాల గురించి తెలియజేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎం.మల్లయ్య, ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు, ఉద్యాన అధికార శాంతిప్రియ, ఏఈఓలు రంజిత్, సాయిప్రకాష్, పూజిత, పున్నమి, రైతులు పాల్గొన్నారు.
డీఏఓ ఎం.విజయనిర్మల, మల్యాల కేవీకే సమన్వయకర్త డాక్టర్ ఎస్.మాలతి
‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ ప్రారంభం