
మార్కెట్ సంఘానికి రాజకీయ రంగు
వరంగల్: వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లోని కమీషన్ వ్యాపారస్తుల సంఘం ఏర్పాటుకు రాజకీయ రంగు పులుముకుంది. 2018లో ఏర్పడిన కూరగాయల కమీషన్ వ్యాపారుల సంఘానికి ఎన్నికలు నిర్వహించాలని వ్యాపారులు డిమాండ్ చేయడంతో 29జూన్ 2024న రద్దు చేస్తున్నట్లు అప్పటి అధ్యక్షుడు జారతీ శ్రీనివాస్ ప్రకటించారు. నెలరోజుల్లో ఏర్పాటు చేసేందుకు ఐదుగురు సభ్యులతో అడ్హక్ కమిటీని ఏర్పాటు చేశారు. సంఘం లెక్కల పేరుతో ఆర్నెళ్లపాటు వాయిదా వేశారు. 11ఆగస్టు 2024న అడ్హక్ కమిటీ సభ్యులు ఏకగ్రీవంతో నూతన కమిటీ ఏర్పాటు చేసేందుకు అదే నెల 13న సమావేశం ఏర్పాటు చేశారు. ఈవిషయం తెలిసిన మార్కెట్లోని ఒక వర్గం అధికార పార్టీ నాయకుని అనుయాయునికి చెప్పి మరోసారి వాయిదా వేయించారు. గతంలో జరిగిన విధంగానే ఈసారి కూడా తాము చెప్పిన వారే అధ్యక్ష, కార్యదర్శులుగా ఉంటారని సదరు నాయకుడు ఆదేశాలు జారీ చేయడంతో ఆవిషయం తెలిసిన వ్యాపారులు వ్యతిరేకిస్తూ ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీంతో ఎన్నిక మరోసారి వాయిదా పడింది.
కమిటీలేక సమస్యలు అపరిష్కృతం
మార్కెట్లో కమిటీ లేక పోవడంతో వ్యాపారుల సమస్యలు పేరుకుపోవడంతో నూతన కమిటీని ఎలాగైనా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వచ్చింది. 11 డిసెంబర్ 2024లో వ్యాపారులంతా సమావేశమై అన్ని కమిటీలు రద్దు చేస్తూ నెల రోజుల్లో నూతన కమిటీ ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈమేరకు మూడు నెలల తర్వాత మార్చి 29న కమీషన్ వ్యాపారులంతా కలిసి చింతల్ బ్రిడ్జి సమీపంలో ఒక హోటల్లో వ్యాపారులు సమావేశమయ్యారు. మార్కెట్లో లైసెన్సులు కలిగిన 91 మందిలో 60 మంది హాజరు కాగా.. ఒక వర్గానికి చెందిన కొందరు వ్యాపారులు గైర్హాజరయ్యారు. ఈలోగా.. వ్యాపారుల్లో ఉన్న ప్రజాప్రతినిధి సూచన మేరకు మరోసారి సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఎన్నుకుంటే బాగుంటుందని చెప్పడంతో ఆ సమావేశాన్ని వాయిదా వేస్తూ.. ఏప్రిల్ 4న నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించేందుకు ఇద్దరు సీనియర్ వ్యాపారులను ఎన్నికల అధికారులుగా నియమిస్తూ సమావేశంలో తీర్మానించారు. ఎన్నికల కమిటీ ఏప్రిల్ 2న నామినేషన్లు వేయాలని, 4న ఎన్నిక పోలింగ్ నిర్వహిస్తామని ప్రకటించింది. ప్రత్యక్ష ఎన్నికలను నిర్వహిస్తే కమిటీ చేజారి పోతుందని భావించిన వ్యాపారులుగా ఉన్న అధికార పార్టీ నాయకులు ఈఎన్నికలను సైతం వాయిదా వేయించారు. గత ఎన్నికల్లో బహిరంగంగా ఆరోపణలు చేసిన వారే ఈవ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగితే మోడల్ మార్కెట్ మారి సందర్భంలో పాట్ల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలు బహిర్గతమవుతాయన్న ఉద్దేశ్యంతోనే కొంత మంది సామాజిక వర్గం పేరుతో కమిటీ అధ్యక్ష పదవిని కై వసం చేసుకోవాలని చూస్తున్నట్లు వ్యాపారులు ఆరోపిస్తున్నారు.
సీల్డ్ కవర్లో కమిటీ..
ఈనెల 6న ఒక ఫంక్షన్ హాల్లో జరిగే సమావేశంలో నూతన కమిటీ ఏర్పాటవుతుందని, ఈసమావేశానికి అధికార పార్టీకి చెందిన నాయకులు వచ్చి అధ్యక్ష, కార్యదర్శుల పేర్లు ప్రకటిస్తారని ఆదివారం మార్కెట్లో ప్రచారం జరిగింది. కూరగాయలు అమ్ముకునే వ్యాపారులకు రాజకీయ రంగు పులమడం సరికాదని కమీషన్ వ్యాపారులు వాపోతున్నారు. గతంలో ఇలానే కమిటీ ఏర్పాటు కావడం వల్ల ఎలాంటి లబ్ధి వ్యాపారులకు చేకూరలేదని అంటున్నారు. అధికార పార్టీ నేతలు వ్యాపారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలా కాని పక్షంలో కొత్త సంఘం ఏర్పాటు చేసుకునేందుకు కమీషన్ వ్యాపారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
సీల్డ్ కవర్లో లక్ష్మీపురం మార్కెట్ అధ్యక్ష, కార్యదర్శుల పేర్లు
వ్యతిరేకిస్తున్న కమీషన్ వ్యాపారులు
కొత్త సంఘం ఏర్పాటుకు సిద్ధం?