
బీసీ, ఎీస్సీ, ఎస్టీలు చైతన్యవంతులవ్వాలి
● రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు
కాజీపేట రూరల్: బీసీ, ఎస్సీ, ఎస్టీలు గ్రామస్థాయి నుంచి సామాజికంగా చైతన్యవంతులు కావాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు అన్నారు. కాజీపేట ఫాతిమానగర్ వైష్ణవి గ్రాండ్ హోటల్లో ఆదివారం జరిగిన సామాజిక న్యాయం, రాజ్యాధికారం కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ సన్నాహక, ఆవిర్భావ సమావేశంలో విశిష్ట అతిథిగా హాజరైన చిరంజీవులు మాట్లాడుతూ.. జేఏసీని బలోపేతం చేసి గ్రామగ్రామాన బీసీ, ఎస్సీ, ఎస్టీలు సామాజికంగా చైతన్యవంతులైతేనే రాజ్యాధికారం వస్తుందన్నారు. 1 శాతం లేని వెలమలు ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ల నుంచి పాలించారని, ఎస్సీ, ఎస్టీ, బీసీలు అంతా కలిసి 90 శాతం ఉన్నప్పటికీ అధికారానికి, సంపదకు దూరంగా ఉంటున్నారన్నారు. జేఏసీ స్టేట్ కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహరాజ్ మాట్లాడుతూ.. జేఏసీ ఆధ్వర్యంలో సామాజిక తెలంగాణ సాధిస్తామన్నారు. కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ నాగం కుమారస్వామి, డాక్టర్ ఎంఎఫ్.గోపీనాథ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవికృష్ణగౌడ్, దాసోజు లలిత, సాయిని నరేందర్, డాక్టర్ కూరపాటి రమేశ్, డాక్టర్ లేఖిని సంపత్, శ్రీనివాస్ ముదిరాజ్, రాసాల వినోద్యాదవ్, పూసల సాయిబాబా, మేకల సుమన్, వడ్డెపల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఆపరేషన్ చేశారు..
బ్యాండేజ్ క్లాత్ మరిచారు
● కమలాపూర్ సీహెచ్సీలో
వైద్యుల నిర్లక్ష్యం..బాలింతకు నొప్పులు
● ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన
కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఓ గర్భిణికి ఆపరేషన్ చేసి బ్యాండేజ్ క్లాత్ మరిచారు. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. కమలాపూర్ మండలం ఉప్పల్కు చెందిన అండ్రాసి తిరుమల వారం క్రితం ప్రసవం కోసం కమలాపూర్ సీహెచ్సీకి వచ్చింది. వైద్యులు ఆపరేషన్ చేశారు. ఆతర్వాత ఓ బ్యాండేజ్ క్లాత్ బయటకు తీయకుండా వదిలేశారు. దీంతో తిరుమలకు తీవ్రమైన నొప్పులు వచ్చాయి. వెంటనే కుటుంబ సభ్యులు సీహెచ్సీకి తీసుకెళ్లారు. ఆమెకు ఆపరేషన్ చేసిన డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో అక్కడే ఉన్న మరో వైద్యుడు ఆపరేషన్ చేసిన వైద్యురాలితో ఫోన్లో మాట్లాడి ఆ బ్యాండేజ్ క్లాత్ను తొలగించారు. ప్రసూతి కోసం ఆస్పత్రికి వస్తే ఫోన్ మాట్లాడుతూ.. నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేసి బ్యాండేజ్ క్లాత్ మరిచిపోయారని బంధువులు చెబుతున్నారు. కాగా.. ప్రభుత్వాస్పత్రులపై నమ్మకంతో వస్తే వారు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని, పరిస్థితి విషమించి జరగరానిది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని బాలింత బంధువులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు.