
విస్నూరులో నకిలీ గురువు
పాలకుర్తి టౌన్: జనగామ జిల్లా పాలకుర్తి మండలం విస్నూరులో ఓ వ్యక్తి విచిత్ర వేషధారణతో తన అనుచరులతో గ్రామంలో గుర్రంపై చక్కర్లు కొట్టాడు. జనానికి శఠగోపం పెట్టాలని పన్నాగం వేశాడు. మీఊరిని క్షుద్రశక్తులు ఆవహించాయి.. కీడు సోకిందని నమ్మించి జనం అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని గ్రామ పెద్దలతో నమ్మబలికి గ్రామంలో ఒక చోట బస చేశాడు. గ్రామంలో పుర వీధుల్లో గుర్రంపై తిరుగుతూ కుటుంబాల్లో సమస్యలున్నాయని బాగు చేస్తానని ప్రజలను నమ్మించాడు. ఒక్కొక్కరు రూ.2 వేలు నుంచి రూ.15 వేలు వరకు నకిలీ దేశగురువుకు ముడుపులు చెల్లించారు. డబ్బులు లేక కొంత మంది 5 క్వింటాళ్ల బియ్యంతోపాటు గొర్రె పిల్లలు అందజేశారు. నకిలీ దేశ గురువు అనుచరులను విస్నూ రు మాజీ ఎంపీటీసీ మాటూరి యాకయ్యతో పాటు గ్రామస్తులు పట్టుకుని ప్రశ్నించారు. వారి ద్విచక్రవానాలను గుర్రాన్ని తరలించే వాహనాన్ని స్వాధీనపర్చుకున్నారు. గ్రామస్తుల నుంచి రూ.1.30 లక్షలు వసూలు చేశామని ఒప్పుకున్నారు. వసూలు చేసిన డబ్బులు చెల్లించే వరకు ఎటూ వెళ్లకూడదని వారిని గ్రామస్తులు చుట్టుముట్టారు. దీంతో నకిలీ దేశ గురువు అనుచరులు ఫోన్పే ద్వారా డబ్బులు తిరిగి చెల్లించారు. కాగా.. సూర్యాపేట జిల్లా మండలం పెన్హాడ్ మండలం నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన రాజశేఖర్స్వామి నకిలీ దేశగురువుగా గ్రామాల్లో సంచరిస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈవిషయంపై పోలీసులను వివరణ కోరగా.. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.
మాయమాటలతో
రూ. 1.30 లక్షలు వసూలు
నిలదీసిన గ్రామస్తులు..
పారిపోయిన మోసగాడు
డబ్బులు చెల్లించిన అతడి అనుచరులు