
2న ఉమ్మడి జిల్లా స్థాయి చెస్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో ఈనెల 2న ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్–9, 11 బాలబాలికల విభాగంలో చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కార్యదర్శి పి.కన్నా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. లక్ష్మీపురంలోని వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ కాటన్ ఇండస్ట్రీస్ భవనంలో టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు అండర్–9 విభాగంలో జనవరి 01, 2016 తర్వాత, అండర్–11 కేటగిరీలో పాల్గొనే క్రీడాకారులు జనవరి–01, 2014 తర్వాత జన్మించిన వారు అర్హులుగా పేర్కొన్నారు. రెండు విభాగాల్లో గెలుపొందిన బాలుర నుంచి నలుగురు, బాలికల నుంచి నలుగురు క్రీడాకారులను మే చివరి వారంలో హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 90595 22986 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
కాంట్రాక్టు అసిస్టెంట్
ప్రొఫెసర్ల సమ్మె విరమణ
కేయూ క్యాంపస్: రాష్ట్రంలోని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని 12 రోజులుగా సమ్మె చేస్తున్న కేయూ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు బుధవారం సమ్మె విరమించారు. కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం సమ్మె శిబిరం వద్దకు వచ్చి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు రిటైర్డ్మెంట్ అయ్యే వరకు వారిని యథావిధిగా కొనసాగిస్తారని, డిస్టర్బ్ చేయరని, ఉద్యోగ భద్రత ఉంటుందని వీసీ ఆదేశాల మేరకు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు హామీ ఇచ్చారు. దీంతో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు సమ్మె విరమింపచేశారు. ఇందులో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల కో–ఆర్డినేషన్ బాధ్యులు డాక్టర్ సాధురాజేశ్, శ్రీధర్కుమార్లోథ్, మాదాసి కనకయ్య, పి.కరుణాకర్రావు, ఆశీర్వాదం, భిక్షపతి, బి.సతీశ్, ఫిరోజ్పాషా, చంద్రశేఖర్, జూల సత్య, అరూరి సూర్యం, సూర్యనారాయణ, రఘువర్ధన్రెడ్డి, చందులాల్, శ్రీదేవి, అనిల్, స్వప్న, సాహితి, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
దర్గా–ఫాతిమానగర్లో వర్షబీభత్సం
కాజీపేట రూరల్: కాజీపేట ఫాతిమానగర్ – దర్గాలో బుధవారం కురిసిన గాలి, రాళ్ల వాన బీభత్సానికి పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. అప్జల్నగర్, బస్తీ దవాఖాన ప్రాంతం, సర్వర్నగర్, బియాబానీ నగర్లో చెట్లు విరిగి నెలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు కిందపడ్డాయి. సర్వర్నగర్లో 11 కేవీ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి, అఫ్జల్నగర్లో ఇంటి పైకప్పు రేకులు ఆకాశంలోకి లేచి రైలు పట్టాలపై పడ్డాయి. ఇళ్లపైనున్న వాటర్ ట్యాంకులు కిందపడ్డాయి. వర్షబీభత్సంతో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దర్గా ప్రాంతంలో కరెంట్ లేదని మాజీ కార్పొరేటర్ ఎండి.అబుబక్కర్ తెలిపారు. సకాలంలో స్పందించి విద్యుత్ను పునరుద్ధరించినందుకు ఎమ్మెల్యే, మేయర్, విద్యుత్ మున్సిపల్ అధికారులకు మాజీ కార్పొరేటర్ అబుబక్కర్ కృతజ్ఞతలు తెలిపారు.

2న ఉమ్మడి జిల్లా స్థాయి చెస్ పోటీలు