
అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం
వెంకటాపురం(కె) : మండల కేంద్రంలోని జక్కులవారి వీధికి చెందిన ఓ వ్యక్తి ఈ నెల 24వ తేదీన అదృశ్యం కాగా, మంగళవారం మృతదేహం లభ్యమైంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. జక్కుల వారి వీధికి చెందిన వాసం రవికిరణ్ కుమార్ (40) మిషన్ భగీరథ పథకంలో పంప్ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. అతడి ఆరోగ్యం బాగోలేక కొంతకాలంగా ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఈ నెల 24వ తేదీన భగీరథ నీరు వదిలి పెట్టి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. కాగా రవి కిరణ్ కుమార్ సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. రవికిరణ్ కుమార్ తల్లి సాలమ్మ అతడి జాడ వెతికిన కనిపించక పోవడంతో ఈ నెల 25వ తేదీన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో మంగళవారం వీఆర్కే పురం గ్రామ సమీపంలోని పాలెం వాగు ప్రాజెక్టు కాల్వ సమీపంలో మృతదేహం లభ్యమయ్యిందని పేర్కొన్నారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.