● వరిగడ్డికి బేలర్తో భద్రత..!
కోవెలకుంట్ల సమీపంలో వరిగడ్డిని చుట్టలుగా చుడుతున్న బేలర్
మారుతున్న కాలానికనుగుణంగా రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. యంత్రాలు రైతులకు శ్రమను తగ్గిస్తూ, కూలీల కొరతను తీరుస్తూ డబ్బులు ఆదా చేస్తున్నాయి. జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో ప్రతి ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో వరి విస్తారంగా సాగవుతోంది. ఈ ఏడాది రబీ సీజన్లో వరి పంట చేతికందగా రైతులు కంబైండ్ హార్వేస్టర్లతో కోత, నూర్పిడి పనులు పూర్తి చేశారు.. పైరు నుంచి పంట ఉత్పత్తులు వేరుకాగా పొలంలో గ్రాసం మిగులుతోంది. గతంలో గ్రాసాన్ని కూలీల సాయంతో ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లలో నింపుకుని కల్లాల్లో వాములుగా భద్రపరిచి పశువులకు ఆహారంగా అందించేవారు. గ్రాసాన్ని సులభంగా తరలించేందుకు సైతం యంత్రాలను వినియోగిస్తుండటంతో చకచకా పనులు జరుగుతున్నాయి. బేలర్ యంత్రం పొలంలోని వరి గడ్డిని చుట్టలుగా చుడుతోంది. ఆ చుట్టలను ట్రాక్టర్ల లో తరలించి కల్లాల్లో వాములుగా వేస్తున్నారు. గ్రాసం భద్రపరుచుకునేందుకు యంత్రం అందుబాటులోకి రావడంతో పని సులభంగా మారడమే కాకుండా రైతులకు కూలీల కొరత, డబ్బులు ఆదా అవుతోంది. చుట్టలుగా చుట్టిన పశుగ్రాసాన్ని వాములుగా వేయడం వల్ల వర్షాకాలం తడవకుండా ఉండటంతో పశువులకు నాణ్యమైన గ్రాసం అందుతోంది.
– కోవెలకుంట్ల


