దళిత యువకుడి బలవన్మరణంపై చలించని పోలీసులు
కర్నూలు(సెంట్రల్): రెండురోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన దళిత యువకుడు సతీష్ మృతికి కారణమైన ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్పై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు కలెక్టరేట్ ఎదుట ధర్నాకు ప్రయత్నించారు. అయితే వారిని మూడో పట్టణ పోలీసులు అడ్డుకొని జులుం ప్రదర్శించారు. సీఐ శేషయ్య వారిపై చేయి చేసుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నెల 3న కర్నూలు నగరంలోని శ్రీరామ్నగర్కు చెందిన సతీష్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే మూడు రోజుల ముందు అతను 15 ఏళ్లుగా ప్రేమించిన ప్రియురాలిని వదిలివేయాలని ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్, త్రీటౌన్ పోలీసులతో కలసి తీవ్రంగా వేధించాడు. ఆ అమ్మాయికి ఫోన్ చేసినా, మాట్లాడినా తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఈ క్రమంలో యువకుడు తన ప్రేమ విఫలమవుతుందనే ఆందోళనతో ఆదివారం ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సోమవారం పోస్టుమార్టం అనంతరం పోలీసులు అంబులెన్స్లో శవాన్ని తీసుకెళ్లాలని బంధువులకు అప్పగించారు. అయితే బంధువులు ఆత్మహత్యకు కారణమైన గట్టు తిలక్ను అరెస్టు చేయాలని, మూడో పట్టణ పోలీసులపై విచారణ చేయాలని కోరుతూ నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మెడికల్ కాలేజీ అవు ట్ గేటు దగ్గర అంబులెన్స్లో ఉన్న శవాన్ని బయటకు తీసి స్ట్రెక్చర్పై కలెక్టరేట్ వైపు ర్యాలీగా వెళ్లారు. వీరిని మూడో పట్టణ పోలీసులు అడ్డుకున్నారు. సీఐ శేషయ్య, పోలీసులు ర్యాలీగా వెళ్లకూడదని, నిరసన వ్యక్తం చేయకూడదని హాస్పిటల్ అవుట్ గేటు దగ్గర అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు బలవంతంగా స్ట్రెక్చర్పై ఉన్న శవాన్ని అంబులెన్స్లో ఎక్కించేందుకు ప్రయత్నించగా కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో వారిపై పోలీసులు జులుం ప్రదర్శించారు. అడ్డువచ్చిన వారిపై దాడి చేసి బలవంతంగా అంబులెన్స్లో ఎక్కించారు. బంధువులు అంబులెన్స్ ముందుకు వెళ్లకుండా కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు, సతీష్ కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తమపైనే పోలీసులు దాడి చేయడం హేయమని, తమకు న్యాయం చేయమని కోరితే దాడి చేయడం అన్యాయమన్నారు. గట్టు తిలక్ను అరెస్టు చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు.
ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడిపై
కేసు నమోదుకు వెనుకంజ
కులం పేరుతో దూషించి,
పోలీసుస్టేషన్లో వేధింపులు
సూసైడ్ నోట్ లభ్యమైనా
చర్యలకు ససేమిరా
కలెక్టరేట్ ఎదుట నిరసనకు సిద్ధమైన
కుటుంబ సభ్యులు
అడ్డుకుని జులం ప్రదర్శించిన
త్రీటౌన్ పోలీసులు


