డోన్: అధికార అండతో టీడీపీ నాయకులు బరితెగిస్తున్నారు. తెలుగు తమ్ముళ్లకు ఉపాధి కల్పించేందుకు దౌర్జన్యాలు, బెదిరింపులే కాకుండా అధికారులతో వేధింపులకు పాల్పడుతున్నారు. రెవెన్యూ, పోలీసు, విజిలెన్స్ శాఖల అధికారుల్లో కొందరు టీడీపీ నేతలకు జీహుజూర్ అంటూ గులాం గిరి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల రేషన్ దుకాణాలపై దాడులు చేసినా ఎలాంటి తప్పు లు దొరకపోవడంతో చివరకు కొత్త ఎత్తుగడ వేశారు. టీడీపీ కార్యకర్తల ఇళ్లల్లో నుంచి రేషన్ బియ్యం తెచ్చి కాటా తక్కువ ఉన్నట్లు చూపించడమే కాక వారి స్టేట్మెంట్ను రికార్డు చేసి సస్పెండ్ చేసేందుకు కూడా వెనకాడటం లేదు. రెండు రోజుల క్రితం ఇదే తరహాలో డోన్ మండలం వలసల గ్రామంలో తూకంలో తేడా లంటూ డీలర్పై వేటు వేసిన విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల రేషన్ దుకాణాల్లో ఆకస్మి క తనిఖీల్లోనూ రెవెన్యూ, పోలీసు అధికారులతో పాటు టీడీపీ కార్యకర్తలు ముఖ్య పాత్ర పోషిస్తున్నా రు. తాజాగా సోమవారం డోన్ పట్టణంలో వైఎస్సా ర్సీపీ మద్దతుదారు డీలర్ను ఇలాగే వేధించారు. పట్టణంలోని సీ3–231–2019 షాప్ దుకాణం తనిఖీలో మల్యాల గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ధర్మ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అధికారుల సమక్షంలోనే స్టాక్ రికార్డులు పరిశీలించడం చూసి పలువురు ఆశ్చర్యపోయారు. రేషన్ దుకాణాన్ని వైఎస్సార్సీపీ వర్గీయుడు వదులుకునేలా ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి యంత్రాంగం దాడుల పేరు తో బెదిరింపులకు పాల్ప డటం, మాట వినని డీలర్లపై అక్రమ కేసులు బనాయించేందుకు టీడీపీ నేతలు యత్నిస్తుండటంతో డీలర్లు బెంబేలెత్తుతున్నారు.
సగానికి పైగా డీలర్షిప్ వదిలేశారు..
డోన్ నియోజకవర్గంలోని ప్యాపిలి మండలంలో 52, బేతంచెర్ల మండలంలో 45, డోన్ మండలంలో 72 మంది చౌకదుకాణ డీలర్లు ఉండగా.. టీడీపీ నేతలు, అధికారుల వేధింపులు తాళలేక 50 శాతం మంది డీలర్షిప్ను వదులుకున్నారు. టీడీపీ నాయకుల ప్రోద్బలంతో పోలీసుల వేధింపులు తాళలేక డీలర్షిప్ వద్దనుకున్న వారు అధికంగా ఉన్నారు. మరో 30 మంది తమ సప్పెండ్ను సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చు కున్నారు. ఇక లాభం లేదు అనుకుని సివిల్ సప్లై గోడౌన్ ఇన్చార్జి రబ్బానీపై ఒత్తిడి తెచ్చి ఎలాంటి కాటా (తూకం) వేయకుండానే రేషన్ దుకాణాలకు బియ్యం బస్తాలను తరలిస్తున్నారు. చౌక దుకాణాలకు చేరిన వెంటనే పోలీసులు, టీడీపీ కార్యకర్తల సహాయంతో రెవెన్యూ అధికారులు ఆ దుకాణాలను తనిఖీ చేసి బస్తాలను తూకం వేయడం ద్వారా కేజీ నుంచి 2 కేజీల వరకు ప్రతి బస్తాకు తక్కువ ఉన్నాయని కేసులు రాస్తూ వేధిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గోడౌన్ నుంచి దుకాణానికి చేరేలోగా బస్తాకు అర కేజీ తూకం తగ్గుతుండటంతో రెవెన్యూ అధికారులు డీలర్ తొలగింపునకు సులువైంది.
వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై
తీవ్ర వేధింపులు
డీలర్షిప్ వదులుకునే వరకు ఒత్తిళ్లు
వత్తాసు పలుకుతున్న రెవెన్యూ,
పోలీసు ఉన్నతాధికారులు
ఆకస్మిక తనిఖీలంటూ
భయపెడుతున్న వైనం
సగానికిపైగా దుకాణాలను
వదులుకున్న డీలర్లు


