● పీజీఆర్ఎస్లో అర్జీ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి
కర్నూలు(సెంట్రల్): పాణ్యం నియోజకవర్గంలో కొందరు టీడీపీ నాయకులు ఉచిత ఇసుకను అమ్ముకుంటున్నారని, అడ్డుకోవాల్సిన అధికారులు వారికే కొమ్ము కాస్తుండడంతో ప్రజలకు ఇసుక దొరకడంలేదని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన కలెక్టరేట్లో జేసీ నూరుల్ ఖమర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొందరు టీడీపీ నాయకులు ఉచిత ఇసుక రవాణాను అడ్డుకొని డంపుల్లో దాచుకొని అధిక ధరలకు విక్రయాలు చేస్తున్నారని ప్రజల నుంచి ఫిర్యాదులు వెళ్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. మరోవైపు కల్లూరు మండలం దొడ్డిపాడు గ్రామ రైతులకు భూ సంబంధిత, సాగునీటి, పంట నష్టపరిహారం సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదన్న విషయాన్ని జేసీ దృష్టికి తీసుకొచ్చారు. అందుకు జేసీ స్పందిస్తూ విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. కాటసాని వెంట పెద్దటేకూరు నాయకులు హనుమంతరెడ్డి, దొడ్డిపాడు గ్రామ నాయకులు ఉన్నారు.


