బేతంచెర్ల: ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన రమేష్ శెట్టి (80) శనివారం అనారోగ్యంతో మృతి చెందాడు. అతనికి కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో స్థానికులు బేతంచెర్లలోని ‘ఆ నలుగురు’ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వన్నూర్ బాషాకు సమాచారం ఇచ్చారు. వారు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లి అనంతరం బృందం సభ్యులు గ్రామానికి చేరుకుని రమేష్ శెట్టికి సొంత కుటుంబ సభ్యుల్లా అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు.
విద్యుదాఘాతంతో లారీ డ్రైవర్ మృతి
వెల్దుర్తి: విద్యుదాఘాతంతో లారీ డ్రైవర్ సురేంద్ర(38) మృతి చెందాడు. ఈ దుర్ఘటన మదార్పురం గ్రామంలోని ఇటుకల బట్టీలో చోటుచేసుకుంది. ఎస్ఐ నరేశ్ తెలిపిన వివరాల మేరకు.. ఉలిందకొండకు వెళ్లేందుకు కల్లూరు మండలం చెట్లమల్లాపురం గ్రామానికి చెందిన డ్రైవర్ చాకలి సురేంద్ర లోడింగ్లో ఉన్న లారీని రివర్స్ చేశాడు. ఈ సమయంలో 11కెవీ విద్యుత్ లైన్ కలిగిన విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. ఓ వైరు లారీ టైర్లను ఆనుకుంటూ వేలాడింది. ఏం జరిగిందోనని చూసుకునేందుకు లారీ డ్రైవర్ కిందకు దిగే ప్రయత్నంలో విద్యుత్ సరఫరా ఉన్న వేలాడిన వైరుపై ఓ కాలు ఉంచాడు. భూమిపై మరో కాలు మోపడంతోనే విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న డోన్ ఏడీఏ సుబ్బన్న, వెల్దుర్తి ఏఈ వెంకటేశ్వర్లు, సిబ్బంది, ఎస్ఐ నరేశ్ బృందం సంఘటనాస్థలికి చేరుకుని విచారించారు. కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. సురేంద్రకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
లారీ టైర్లపై వేలాడిన 11కేవీ విద్యుత్ వైరు
మృతిచెందిన
లారీ డ్రైవర్ సురేంద్ర


