కల్లూరు: ఖాళీ భూమి కనిపిస్తే చాలు టీడీపీ నాయకులు కబ్జాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి విమర్శించారు. కల్లూరు మండలం బస్తిపాడు గ్రామ పొలిమేరలో ఉన్న సమాధుల పల్లెలో రూ. కోట్ల విలువైన గ్రామకంఠం భూమిని టీడీపీ నాయకులు ఆక్రమించేందుకు చదును చేశారు. విషయం తెలుసుకున్న కాటసాని శనివారం స్థానిక నాయకులు, గ్రామస్తులతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో టీడీపీ నేతల భూ ఆక్రమణలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని విమర్శించారు. అధికార పార్టీ నేతలమంటూ ఎక్కడ ఖాళీ స్థలం కనబడితే అక్కడ గద్దల్లా వాలిపోయి కబ్జాలకు పాల్పడుతున్నారన్నారు. బస్తిపాడు గ్రామ పరిధిలోని సమాధుల పల్లెలో ఉన్న గ్రామకంఠం భూమిని టీడీపీ నాయకులు ఎలా ఆక్రమిస్తారని మండిపడ్డారు. సర్వే నెంబర్ 382లోని 1.93 ఎకరాలను టీడీపీ నాయకులు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారని ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీ నాయకుల దౌర్జన్యాలను, కబ్జాలను కచ్చితంగా అడ్డుకొని తీరుతామన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కబ్జా చేసిన భూములను ప్రజలకే స్వాధీనం చేస్తామన్నారు. కబ్జాదారులకు వత్తాసు పలికే అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గత ఎన్నికల్లో గెలవడం కోసం తనపై అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేశారని, ఎవరు ప్రభుత్వ భూములను కబ్జాలు చేస్తున్నారో ఇప్పుడు ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ ఎప్పుడూ ప్రజల తరఫున పోరాటం చేస్తుందన్నారు.
ఖాళీ భూమి కనిపిస్తే చాలు
అక్రమించేస్తున్నారు
రూ. కోట్ల విలువైన గ్రామకంఠం భూమి
ఆక్రమణను అడ్డుకుంటాం
ప్రజల తరఫున వైఎస్సార్సీపీ పోరాటం
వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా
అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి


