మహానంది: నల్లమల ఘాట్రోడ్డులో రెండు గ్రానైట్ లారీలు ఢీకొని నాలుగు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. చీమకుర్తి నుంచి తాడిపత్రి వైపు రెండు గ్రానైట్ లారీలు వస్తూ ఒకటి గిద్దలూరు పరిధిలోని ఘాట్రోడ్డులో నిలిచిపోయింది. వెనుక ఉన్న లారీ డ్రైవర్ సాయం తీసుకునేందుకు ఆపాడు. ఆగిన లారీ కింది వైపుకు వస్తున్న వెనుక ఉన్న లారీని ఢీకొనడంతో డ్రైవర్ రమేష్ స్వల్పంగా గాయపడ్డాడు. రెండు లారీలు రోడ్డుపైనే నిలిచిపోవడంతో నాలుగు గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మండుటెండలో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. విషయం తెలుసుకున్న మహానంది, గిద్దలూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని జేసీబీల సాయంతో రోడ్డుపై అడ్డుగా ఉన్న లారీలను పక్కకు తప్పించారు. అనంతరం వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.


