కర్నూలులోనే సాయ్ హాస్టల్ కొనసాగించాలి
స్టేడియం ఎదుట క్రికెట్ క్రీడాకారుల ఆందోళన
కర్నూలు (టౌన్): జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులకు క్రీడాకారుల గోడు పట్టడం లేదని క్రీడా సంఘాల జేఏసీ చైర్మన్ నాగరత్నమయ్య మండిపడ్డారు. కర్నూలు స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో 25 ఏళ్లుగా క్రీడాకారులకు సేవలు అందిస్తున్న సాయ్ హాస్టల్ను తరలించరాదన్నారు. ఈ అంశంపై శుక్రవారం స్థానిక స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో క్రికెట్ క్రీడాకారులు ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిసూ నిరసన కార్యక్రమం చేపట్టారు. జేఏసీ చైర్మన్ మాట్లాడుతూ మరమ్మతుల పేరుతో సాయ్ హాస్టల్ను కర్నూలు నుంచి తిరుపతికి తరలించడం వల్ల జిల్లా క్రీడారంగానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఇప్పటికే వివిధ రూపాల్లో అన్ని క్రీడా సంఘాలు ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు, ర్యాలీలు చేపట్టాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి హాస్టల్ తరలింపును నిలిపివేయాలని డిమాండ్ చేశారు.అలాగే సాయ్ అధికారుల మొండి వైఖరి వీడకపోతే తాము ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈనెల రెండవ వారంలో చలో బెంగుళూరు – సేవ్ కర్నూలు సాయ్ స్పోర్ట్స్ హాస్టల్ పేరుతో రీజినల్ సెంటర్ను ముట్టడిస్తామన్నారు. కార్యక్రమంలో క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.


