● మట్టిని ఓవర్లోడ్ చేసుకొని వెళ్తుండగా ఘటన ● తెలుగు గంగ కట్టకు పొంచి ఉన్న ముప్పు
మహానంది: మట్టిని ఓవర్లోడ్ చేసుకుని వస్తున్న టిప్పర్ అదుపు తప్పి తెలుగుగంగ కాల్వలో పడిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా బండిఆత్మకూరు మండలం కృష్ణనంది సమీప ంలోని పొలాల నుంచి ఇటీవల నిత్యం వందల సంఖ్యలో టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారు. శు క్రవారం కృష్ణనంది నుంచి తెలుగుగంగ కట్టమీదు గా మహానంది, నంద్యాల వైపు వస్తున్న టిప్పర్ అ దుపు తప్పి గంగ కాలువలో పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ ప్రాణాలతో బయటపడినట్లు తెలిసింది.
నిబంధనలకు విరుద్ధంగా కట్ట వెంట భారీగా టిప్పర్లు
మహానంది, బండిఆత్మకూరు మండలాలకు చెందిన కొందరు అధికార పార్టీ నాయకులు ఎర్రమట్టి, గ్రావెల్ను వెంచర్లు, ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. గాజులపల్లె, కృష్ణనంది సమీపంలోని కొన్ని పంట పొలాల్లో మట్టిని తరలించేందుకు అధికారపార్టీ నేతలు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. రెండు మండలాలకు చెందిన కీలక నేతలు ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు తెలిసింది. అన్ని అనుమతులు ఉన్నాయంటూనే తెలుగుగంగ కట్ట వెంట భారీగా టిప్పర్లను తరలిస్తుండటం వల్ల కట్టకు ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే పలు చోట్ల కట్ట బలహీనంగా ఉండి, గండ్లు పడిన విషయం తెలిసిందే. కృష్ణనంది నుంచి వచ్చేవి, గాజులపల్లె నుంచి తరలించేవి తెలుగుగంగ కట్టమీదుగా అయ్యన్ననగర్ వరకు వచ్చి అక్కడి నుంచి నంద్యాల, ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. తెలుగుగంగ కాల్వ కట్టమీదుగా ఎలాంటి భారీ వాహనాలు వెళ్లకూడదన్న నిబంధనలు ఉన్నాయి. అయితే అధికారపార్టీకి చెందిన వారు కావడంతో సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాయల్టీ చెల్లింపుతో సహా అన్ని రకాల అనుమతులు ఉంటే ప్రధాన రహదారుల వెంట తీసుకెళ్లవచ్చు కదా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కొన్ని శాఖల అధికారులకు మామూళ్లు ముట్టాయని, విజిలెన్స్, మైనింగ్శాఖల అధికారులు తనిఖీలు చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అధికారపార్టీకి చెందిన ఓ వర్గం నేతలు పేర్కొంటున్నారు.


