కర్నూలు(సెంట్రల్): వాచ్ డాగ్ కమిటీల ద్వారా వాగులు, వంకలను పరిరక్షించాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంకాలం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వాచ్డాగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్నూలు నగరంలో ఐదు చోట్ల అక్రమంగా హంద్రీని అక్రమించిన వారికి నోటీసులు ఇచ్చి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. వీరిలో అర్హులు ఉంటే టిడ్కో గృహాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కల్లూరు మండలంలో మొత్తం 337 మంది నివాసితులు ఉండగా 79 మందిని ఇప్పటికే ఖాళీ చేయించామన్నారు. ఖాళీ చేసిన వారిలో 120 మందికి టిడ్కో గృహాలు ఇచ్చామన్నారు. సమావేశంలో తహసీల్దార్లు ఆంజనేయులు, రవికుమార్, శ్రీనివాసులు పాల్గొన్నారు.


