● పత్తికొండ మాజీ ఎమ్మెల్యే
కంగాటి శ్రీదేవి
వెల్దుర్తి: మామిడి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి డిమాండ్ చేశారు. వెల్దుర్తి మండల పరిధిలోని ఎల్ నగరం గ్రామంలో బుధవారం ఆమె మామిడి తోటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. వాతావరణ మార్పులతో సీజన్లో పూతరాక, వచ్చిన పూత రాలి, నిలిచిన పంటకు గిట్టుబాటు ధర లేదని రైతులు తెలిపారు. ప్రస్తుతం మామిడి పండ్ల బాక్స్ ధర హోల్సేల్ మార్కెట్లో రూ.300 నుంచి రూ.400లు పలుకుతోందని, గత ప్రభుత్వంలో అదే బాక్స్ ధర రూ.1500 నుంచి రూ.2వేలు వచ్చిందని వారు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ధర లభించకపోవడం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. తమ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారని, అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు లభించాయని తెలిపారు. వెంటనే మామిడి ఎగుమతి అవకాశాలను పెంచాలన్నారు. మామిడి పండ్ల నిల్వ సదుపాయం కల్పించి, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని కోరారు. మామిడి రైతులకు వెంటనే చంద్రబాబు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఎల్ నగరం దేశాయ్ సమీర్కుమార్ రెడ్డి , మామిడి పండ్ల తోటల రైతులు పాల్గొన్నారు.


