కౌతాళం: వేసవిలో గ్రామాల ప్రజల గొంతులెండుతున్నాయి. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయక పోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మండల పరిధిలోని ఎరిగేరి గ్రామంలో ప్రజలు నీటి కోసం పడిగాపులు కాస్తున్నారు. జంగాల కాలనీకి వారానికి ఒకసారి మాత్రమే తాగునీరు వస్తుండడంతో నీటి కోసం యుద్ధం తప్పడం లేదని స్థానికులు మారెమ్మ, జంబులమ్మ, లక్ష్మి, మూకన్న, రాములమ్మ, జంబమ్మ తదితరులు తెలిపారు. జంగాల కాలనీ ఆదోని రోడ్డులో గ్రామం చివరన ఉందని, ఈ కాలనీకే నీటి కష్టాలు అధికంగా ఉన్నాయని వాపోయారు. ఈ విషయంపై ఎన్నోసార్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు, గ్రామ నాయకులకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. వారానికోసారి మాత్రమే నీరు వస్తాయని, నాలుగు బిందెలు కూడా దొరకడం లేదని, గంట సేపు మాత్రమే నీరు వదిలితే అందరికీ ఎలా సరిపోతాయని ప్రశ్నిస్తున్నారు. తాగునీరు లేక ఫిల్టర్బెడ్ వద్ద నుంచి నీరు తెచ్చుకొని తాగాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోపారు. ఉన్నతాధికారులు స్పందించి కాలనీకి తాగునీరు సక్రమంగా సరఫరా చేయాలని కోరుతున్నారు.


