ఆలూరు: వేసవిలో తాగునీటి కోసం ప్రజలు, ప్రయాణికులు, పాదచారులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలతో మేజర్, మైనర్ పంచాయతీలలో, ప్రధాన కూడళ్లలో, కార్యాలయాల వద్ద చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి మేజర్ గ్రామ పంచాయతీలో కనీసం 6 చలివేంద్రాలకు తగ్గకుండా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అధికార పార్టీ నాయకులు అత్యుత్సాహంతో పచ్చ తోరణాలు కట్టి వాటిని ప్రారంభించారు కానీ తర్వాత వాటి నిర్వహణ మరిచారు. చలివేంద్రాల్లో నీరు అందుబాటులో ఉంచకపోవడంతో పని మీద బయటికి వచ్చిన వారు దాహార్తి తీర్చుకునేందుకు హోటళ్లు, కూల్డ్రింక్స్ షాపుల్లో నీటిని కొనుగోలు చేసి గొంతు తడుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గ కేంద్రమైన ఆలూరులో ఎల్లార్తి రోడ్డు సమీపంలో మర్రితాత మఠం వద్ద తడికెలతో షెడ్డు వేసి చలివేంద్రం ఏర్పాటు చేశారు కానీ నీటి కుండలను ఉంచడం మరిచారు. దూరం నుంచి చలివేంద్రాన్ని చూసి గొంతు తడుపుకుందామని వెళ్లిన వారు అక్కడ నీరు లేకపోవడంతో దాహార్తితో నిరాశగా అలాగే వెనుదిరుగుతున్నారు.


