కోవెలకుంట్ల: మండలంలోని కంపమల్లకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు సోముల వెంకటేశ్వరరెడ్డి పొలంలో సాగునీటిని మళ్లించే పైపులు మంగళవారం మంటల్లో కాలిపోయాయి. బాధితుడు తెలిపిన మేరకు వివరాలు.. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు చిన్న సుబ్బారెడ్డి పొలంలో మొక్కజొన్న కోత పనులు పూర్తి కాగా మిగిలిన వ్యర్థాలకు నిప్పంటించాడు. మంటలు పక్కనే ఉన్న వెంకటేశ్వరెడ్డి పొలం వైపు వ్యాపించాయి. పొలం గట్టున ఉంచిన పైపులు మంటల్లో కాలిపోయాయి. పక్కనే కోత దశలో ఉన్న వరి, కొర్ర పంటలవైపు మంటలు వ్యాప్తి చెందే సమయంలో పసిగట్టి హుటాహుటినా అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. లేని పక్షంలో చేతికందే పైర్లు మంటల్లో కాలిపోయి తీవ్ర నష్టం వాటిల్లేదని రైతు వాపోయారు. రాజకీయ కక్షతోనే టీడీపీ నేత ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.


