కర్నూలు: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి మొత్తం 121 ఫిర్యాదులు వచ్చాయి. కర్నూలు రెండో పట్టణ పోలీస్స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించి నేరుగా వారితో మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగాల పేరుతో మోసం, భార్యాభర్తల తగాదాలు, పొలం గట్ల తగాదాలు తదితర సమస్యలపై ఫిర్యాదులు వచ్చారు. చట్టపరిధిలో విచారణ జరిపి వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, సీఐలు శివశంకర్, మస్తాన్ వలి తదితరులు పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
జడ్జిగా గిరిధర్ బాబు
కర్నూలు (అర్బన్): నంద్యాల సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ (రైల్వేస్)గా ఎస్.గిరిధర్ బాబును నియమించారు. ఈ మేరకు న్యాయ శాఖ ప్రభుత్వ కార్యదర్శి గొట్టపు ప్రతిభాదేవి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
1 నుంచి వేసవి సెలవులు
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో 2025–26 విద్యా సంవత్సరానికి వర్సిటీ అనుబంధ యూజీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ, ఎమ్ఈడీ, ఎమ్పీఈడీ, లా కళాశాలలకు మే 1వ తేదీ నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్లు వర్సిటీ అకడమిక్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ సీవీ కృష్ణారెడ్డి తెలిపారు. జూన్ 14వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయని, జూన్ 15వ తేదీన పునఃప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
అన్నప్రసాద వితరణకు రూ.4 లక్షల విరాళాలు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ పథకానికి పలువురు భక్తులు రూ.4 లక్షల విరాళాలు అందించారు. సోమవారం హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్కు చెందిన ఈశ్వర్ ప్రకాష్ వశిష్ట రూ.1,25,000 విరాళాన్ని, అలాగే నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఎ.సతీష్కుమార్ రూ.1,10,116 విరాళాన్ని, హైదరాబాద్కు చెందిన ఆర్.చంద్రశేఖరరాజు రూ.1,00,116 విరాళాన్ని, కొండూరు ఆధ్య పేరు మీద రూ.1,00,116 విరాళాన్ని పర్యవేక్షకులు కె.అయ్యన్నకు అందజేశారు.
ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తాం
నందికొట్కూరు: ఆర్థిక స్థోమత లేని ఖైదీలకు ఉచితంగా న్యాయవాది ఏర్పాటు చేస్తామని జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి, సీనియర్ సివిల్ జిల్లా జడ్జి లీలా వెంకటశేషాద్రి అన్నారు. సోమవారం పట్టణంలోని సబ్జైల్ను ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. ఖైదీలతో ముఖాముఖి న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయవాదిని ఏర్పాటు చేసుకోలేని వారికి ఉచిత లాయర్ను నియమించడం జరుగుతుందన్నారు. అనంతరం ఖైదీలకు డాక్టర్ ప్రవీణ్ వైద్య పరీక్షలు చేశారు. ఆయన వెంట సీనియర్ సివిల్ జడ్జి శోభారాణి, జూనియర్ సివిల్ జడ్జి వి. దివ్య, సబ్జైల్ ఇన్చార్జ్ సూపరింటెండెంట్ ఎ. శ్రీనివాసులు ఉన్నారు.
శ్రీశైలంటెంపుల్: శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామి వార్లకు సోమవారం సహస్రదీపార్చన సేవ నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలోని పురాతన మండపంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు వేదమంత్రోచ్ఛరణలతో సహస్రదీపార్చన పూజలు జరిపించారు. సేవలో భాగంగా మండపంలో వెయ్యి దీపాలను వెలిగించి, ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామిఅమ్మవార్లను వెండిరథంపై ఆశీనులను చేసి ఆలయ ప్రదక్షిణ నిర్వహించారు.


