ఆళ్లగడ్డ: జయజయ నారసింహ నామ సంకీర్తనలు ప్రతిధ్వనిస్తుండగా.. దేదీప్యమానమైన విద్యుద్దీపకాంతుల వెలుగులో వేద పండితుల వేదోక్త మంత్ర పఠనములు.. ఆస్థాన విద్వాంసుల మంగళకరమైన వాయిద్యాల నడుమ శ్రీ లక్ష్మీనరసింహుడు, భూనీల మహాలక్ష్మీల పరిణయ వేడుక ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఎగువ అహోబిలంలో సోమవారం వైభవంగా జరిగింది. అహోబిల క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహ జయంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం ఉదయం మూలమూర్తులను సుప్రభాత సేవతో మేలుకొలిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులు భూనీలా సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వాములను యాగశాలలో కొలువుంచారు. అర్చన, అభిషేకం, తిరుమంజనం నిర్వహించి అనంతరం ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలతో అలంకరించారు. శ్రీ సుదర్శన హోమం నిర్వహించి పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం కల్యాణ మహోత్సవం వైభవంగా జరిపారు. ముత్యాల తలంబ్రాల కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ముద్రకర్త కీడాంబి వేణుగోపాలన్, సీఏఓ పార్థసారథి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.


