● పనుల కోసం బొలెరోలో గిద్దలూరు వెళ్తుండగా ప్రమాదం
మహానంది: ఊర్లో పనులు లేక ప్రకాశం జిల్లాకు వెళ్లి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వాహనం మాట్లాడుకుని పొద్దున్నే పనులకు వెళ్లి సాయంత్రానికి ఇంటికి వస్తారు. ఈ క్రమంలో మహానంది మండలం గాజులపల్లె గ్రామానికి చెందిన సుమారు 20 మంది వ్యవసాయ కూలీలు గిద్దలూరు, కృష్ణంశెట్టిపల్లె గ్రామాల్లో పసుపు పంటల్లో పనులకు బయల్దేరారు. గిద్దలూరు మార్గంలోని చింతమాను టర్నింగ్ వద్ద బొలేరో అదుపు తప్పి కిందపడటంతో సుమారు 12 మందికి గాయాలైన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. గాజులపల్లెకు చెందిన మరియమ్మ, సుంకమ్మ, విజయలక్ష్మీ, మహాలక్ష్మీ, సావిత్రి, పుష్పావతి, లక్ష్మీదేవి, పద్మావతి, మరియమ్మ, ఎలిశమ్మలతో పాటు మరికొంత మంది ఉదయం బొలేరో వాహనంలో బయల్దేరారు. చింతమాను టర్నింగ్ మలుపు వద్ద బొలేరో వాహనం అదుపు తప్పి బోల్తాపడటంతో సుమారు 12 మందికి గాయాలయ్యాయి. వీరిలో మహాలక్ష్మీ, జూటూరు సావిత్రి, పుష్పావతిలకు తీవ్ర గాయాలైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న మహానంది ఎస్ఐ రామ్మోహన్రెడ్డి, పోలీసులు వివరాలు సేకరించారు. గాయపడిన వారందరిని స్థానికులు 108 వాహనం ద్వారా నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
సుంకమ్మ, విజయలక్ష్మీ


