● మూడు గంటల వ్యవధిలోనే గూళ్యంలో దంపతుల మృతి
● మృతుల కుటుంబానికి ఆలూరు ఎమ్మెల్యే పరామర్శ
హాలహర్వి: తోడునీడగా నిలిచిన దంపతులు మరణంలోనూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు. కొన్ని గంటల వ్యవధిలోనే తనువు చాలించారు. గూళ్యం గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు యమునాసాబ్ తల్లిదండ్రులైన పింజరి ఉలిశేఖన్న(73), ఆయన భార్య ఉలి శేఖమ్మ(70) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఉలి శేఖన్న మృతి చెందారు. ఈ విషయం తెలిసి తీవ్రంగా కలత చెందిన ఉలి శేఖమ్మ అదేరోజు సాయంత్రం 6 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. మూడు గంటల వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరూ మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరికి నలుగురు సంతానం.
ఆలూరు ఎమ్మెల్యే పరామర్శ
విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి సోమవారం గూళ్యం గ్రామానికి చేరుకున్నారు. మృతదేహాలకు నివాళులు అర్పించి, యమునాసాబ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. నివాళులు అర్పించిన వారిలో వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి హర్ధగేరి శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ కార్యదర్శి యల్లప్ప, పార్టీ నాయకులు రామిరెడ్డి, వీరేషప్ప, మండల కార్యదర్శి గోపాల్కృష్ణ, స్థానిక నాయకులు బసవరాజు, శేఖన్న, లింగప్ప, సుంకన్న, కుమార్స్వామి, కార్యకర్తలు ఉన్నారు.


