● ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి
చిప్పగిరి: అమరావతి ప్రాంత రైతులను రాజధాని పేరుతో మరోసారి మభ్యపెట్టడానికే ముఖ్యమంత్రి చంద్రాబాబు ఆసెంబ్లీలో అమరావతిని శాశ్వత రాజధానిగా తీర్మానం చేసి కేంద్రానికి పంపుతున్నారని ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి విమర్శించారు. ఆదివారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు తన రెండేళ్ల పాలనలో అమరావతి రాజధానిలో ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. నిర్మాణం పేరుతో రూ. వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని, అమరావతి నిర్మాణం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందన్నారు. అమరావతి కోసం పోరాటాలు చేసిన రైతులకు చంద్రబాబు ప్రభుత్వం ఏం లాభం చేసిందో ఒక్కసారి ఆలోచించుకోవాలని సూచించారు. ప్లాట్లు ఇచ్చామని గొప్పలు చెబుతున్నా, స్థలాలు ఎక్కడ ఉన్నాయో చాలా మంది రైతులకు తెలియదన్నారు. కూటమి పాలనలో అభివృద్ధి గ్రాఫిక్స్లో మాత్రమే కనిపిస్తోందని, ఆచరణలో మాత్రం లేదన్నారు. 2028లో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని చెబుతూనే తిర్మానం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బుసినే శ్రీరాములు, వెంకటేష్, చంద్రశేఖర్, మహానంది, హనుమంతు పాల్గొన్నారు.


