కర్నూలు(అర్బన్): మైనార్టీ వసతి గృహాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి సబిహా పర్వీన్ హెచ్చరించారు. నగరంలోని పోస్టుమెట్రిక్ మైనార్టీ బాయ్స్ హాస్టల్ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూ పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పలువురు విద్యార్థులకు ఆమె స్వయంగా భోజనం వడ్డించి హాస్టల్లో అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హాస్టల్లో వసతి పొందుతున్న పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు వీలుగా అవసరమైన మెటీరియల్ను సమకూర్చుతామన్నారు. ముఖ్యంగా వసతి గృహంలో శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, గదులు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఆహారం తయారీలో తాజా కూరగాయలు, ఆకు కూరలు వాడాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే సహించబోమన్నారు. హాస్టల్లో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.


