సద్వినియోగం చేసుకోవాలి
● పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల ● దరఖాస్తుకు ఏప్రిల్ 4వ తేదీతుది గడువు ● పది విద్యార్థులకు చక్కటి అవకాశం ● ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్ష
నంద్యాల(న్యూటౌన్): పదో తరగతి ఉత్తీర్ణతతో సాంకేతిక విద్యకు పునాది వేసే ‘పాలిసెట్’కు సాంకేతిక విద్యాశాఖ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలు పొందవచ్చు. పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ముందుగానే సాంకేతిక విద్యాశాఖ ఉన్నతాధికారులు పాలిసెట్–2026 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులు, సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించి జిల్లాలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలు, ఆ కళాశాలల్లో ఉన్న సీట్ల వివరాలు, పరీక్ష తేదీ తదితర వివరాలు ఇలా..
ఉజ్వల భవిష్యత్కు బాటలు..
పాలిటెక్నిక్ ప్రవేశం ద్వారా తక్కువ ఖర్చుతో ప్రాథమికంగా సాంకేతిక విద్య లభిస్తే దానిని పునాదిగా చేసుకుని ఉజ్వల భవిష్యత్కు బాటలు వేసుకునే అవకాశం లభిస్తుంది. గ్రామీణ పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఇంజినీరింగ్ వంటి ఉన్నత సాంకేతిక చదువులను అందుకోవాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. అటువంటి వారికి పాలిటెక్నిక్ కోర్సులు చక్కని వేదికలని పలువురు సాంకేతిక విషయ నిపుణులు పేర్కొంటున్నారు. పాలిసెట్ ద్వారా పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరి విలువైన సాంకేతిక విజ్ఞానాన్ని సొంతం చేసుకుని సత్వర ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందే వీలుంటుంది. పాలిసెట్–2026 కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా.. ఏప్రిల్ 4వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.
పాలిసెట్ ఇలా..
పాలిసెట్ 120 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. గణితం 50, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 30 మార్కులకు పరీక్ష ఉంటుంది. పదో తరగతి సిలబస్ ఆధారంగా ఎంట్రెన్స్ పరీక్ష జరుగుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 25న పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫీజు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.100, ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.400గా నిర్ణయించారు.
ప్రయోజనాలెన్నో..
పాలిటెక్నిక్లో ఏ కోర్సును పూర్తి చేసినా ఉద్యోగం, ఉపాధి సులభంగా లభిస్తుంది. ఈ కళాశాలల్లో ఇటీవల తరచూ ఉద్యోగ మేళాలను నిర్వహిస్తున్నారు. ఆయా కంపెనీల ప్రతినిధులు వచ్చి విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కోర్సు చేయడానికి మూడేళ్లకు కేవలం రూ.13 వేలు అవుతుంది. ఆ తర్వాత ఇంజినీరింగ్ సెకండియర్లో చేరవచ్చు.
లభించే కోర్సులు...
పాలిటెక్నిక్ కోర్సులను ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలు అందిస్తున్నాయి. ఆయా కళాశాలల్లో కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ తదితర కోర్సులు అందుబాటులో ఉంటాయి. పలు చోట్ల ఒక్కో కోర్సులో ఒక్కో బ్రాంచ్కు 60 నుంచి 120 వరకూ సీట్లు అందుబాటులో ఉంటాయి. నంద్యాల జిల్లాలో 7 ప్రభుత్వ, 5 ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ 60, మెకానికల్ 120, ఈసీఈ 120, ఎలక్ట్రికల్ 120 సీట్లు ఉన్నాయి. ఐదు ప్రైవేట్ కళాశాలల్లో సుమారు 1,500 వరకు సీట్లు ఉన్నాయి. ఈ కోర్సు కాల వ్యవధి మూడేళ్లు. ఇందులో భాగంగా ఆరు నెలల పాటు పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. విద్యార్థులు నైపుణ్యం పెంపొందించుకునే శిక్షణ సైతం ఇస్తారు.
పాలిటెక్నిక్ చదివితే చిన్న వయస్సులోనే ఉద్యోగావ కాశాలు లభిస్తాయి. ఉన్నత విద్యతో పాటు స్వయం ఉ పాధికి అవకాశముంటుంది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్యార్థులకు ఉచిత కోచింగ్తో పాటు, సంబంధిత మెటీరియల్ను ఉచితంగా సరఫరా చేస్తున్నాం. – శైలేంద్రకుమార్,
పాలిసెట్ జిల్లా కన్వీనర్, నంద్యాల


