కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ పరీక్షల ప్రధాన సబ్జెక్టుల మూల్యాంకనం ఆదివారం ప్రారంభమైంది. ప్రభుత్వ జూనియర్(టౌన్ మోడల్)కాలేజీలో ఏర్పాటు చేసి క్యాంపులో అసిస్టెంట్ ఎగ్జామినర్లుగా ఎంపిక చేసిన వారందరూ రిపోర్ట్ చేసుకున్నారు. కార్పొరేట్, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో పని చేస్తున్న అధ్యాపకులు ఏఈ అర్డర్లు పొందిన వారిలో అత్యధిక శాతం మంది మొదటి రోజు క్యాంపులో రిపోర్ట్ చేయలేదు. మొదటి రోజు కావడం రిపోర్ట్ చేసుకునేందుకు కొంత ఆలస్యమైంది. సాయంత్రం 5 గంటల వరకు జరిగిన క్యాంపును ఇంటర్మీడియేట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం అధికారి జి.లాలెప్ప పరిశీలించారు.
నేడు ప్రజా ఫిర్యాదుల
పరిష్కార వేదిక
కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులు సమర్పించుకోవచ్చన్నారు. కార్యక్రమాన్ని కలెక్టరేట్తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. అలాగే అర్జీదారులు meekosam.ap.gov.in అనే వెబ్సైట్లోనూ అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ఆర్యూలో
డ్రోన్ టెక్నాలజీపై అవగాహన
● నేటి నుంచి 27 వరకు నిర్వహణ
కర్నూలు కల్చరల్: ఐఐటీ హైదరాబాద్, ట్రిపుల్ఐటీ డీఎమ్ కర్నూలు సంయుక్త భాగస్వామ్యంతో రాయలసీమ యూనివర్సిటీలో సోమవారం నుంచి ఈనెల 27వ తేదీ వరకు డ్రోన్ టెక్నాలజీపై స్కిల్ డెవలపలప్మెంట్ పోగ్రామ్ను నిర్వహిస్తున్నట్లు కార్యక్రమం సమన్వయకర్త ఆచార్య వెంకట సుందరానంద పుచ్చ తెలిపారు. వర్సిటీ వైస్చాన్సలర్ ప్రొఫెసర్ వెంకట బసవరావు మార్గదర్శకాల ప్రకారం వర్సిటీలో కార్యక్రమాన్ని రూపకల్పన చేశామని పేర్కొన్నారు. ఐఐటీ హైదరాబాద్, ట్రిపుల్ఐటీ డీఎమ్ కర్నూలుకు చెందిన ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు డ్రెన్ టెక్నాలజీపై అవగాహన కల్పించడంతో పాటు శిక్షణ ఇస్తారని తెలిపారు. ఇందులో పాల్గొనే గిరిజన యువతకు రిజిస్ట్రేషన్ ఫీజులో పూర్తి మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. ట్రిపుల్ ఐటీడీఎమ్ కర్నూలుకు చెందిన కృష్ణనాయక్, డాక్టర్ రవికుమార్లు సదస్సు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.
కమనీయం.. కల్యాణోత్సవం
ఆస్పరి: పిడకల సమరం అనంతరం కై రుప్పలలో ఆదివారం తెల్లవారుజామున వీరభద్ర స్వామి, కాళికాదేవి కల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. అనంతరం ఆలయంలో గంగపూజ, ప్రభాత సేవ, అభిషేకాలు, హోమం, ప్రత్యేక పూజలు చేశారు. కాళికాదేవి, వీరభద్రస్వామి, పార్వతీ సమేత పరమేశ్వరున్ని పల్లకీలో గ్రామంలో ఊరేగించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. గ్రామంలో సోమవారం సాయంత్రం మహా రథోత్సవం నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
అన్నదాన పథకానికి విరాళాలు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న పలు పథకాలకు భక్తులు రూ.2 లక్షల విరాళాన్ని అందజేశారు. అదివారం కర్నూలుకు చెందిన లక్ష్మయ్య అన్న ప్రసాద వితరణ పథకానికి రూ. 1,00,116 విరాళాన్ని ఏ ఈ ఓ శ్రీనివాసరెడ్డికి అందజేశారు. అలాగే శ్రీకాళహస్తికి చెందిన కె . వెంకట సుబ్బారెడ్డి అన్నప్రసాద వితరణ పథకానికి రూ. 1,00,116 విరాళాలను పర్యవేక్షకులు కె. అయ్యన్నకు అందజేశారు. విరాళాలను అందించిన దాతలకు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందజేసి సత్కరించారు.


