● అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్
కర్నూలు(సెంట్రల్): గ్యాస్నకు ప్రత్యామ్నాయంగా సోలార్, ఎలక్ట్రికల్ కుక్కర్లు, ఇండక్షన్ స్టౌల లభ్యత, ధరలు, ఏజెన్సీల వివరాలు, అవసరమయ్యే బడ్జెట్ వివరాలతో వచ్చే సమావేశానికి రావాలని అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి సూచించారు. ఇందుకోసం అవసరమైన పవర్ పాయింట్ప్రజెంటేషన్ను సిద్ధం చేయాలన్నారు. ఆదివారం ఆమె తన క్యాంపు కార్యాలయం నుంచి గ్యాస్ సరఫరా, కొరత, ఇతర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల, డివిజన్, జిల్లా అధికారలతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న గ్యాస్ సరఫరా, కొరత పరిస్థితి, గ్యాస్ వినియోగాన్ని తగ్గించడానికి జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలపై జేసీ నూరుల్ ఖమర్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..జిల్లాలో సోలార్, ఎలక్ట్రికల్ కుక్కర్లు, ఇండక్షన్ స్టౌల సరఫరా ఏమాత్రం ఉందని, హైదరాబాద్, బెంగళూరులలో ఉన్న కంపెనీలు, వాటి తయారీ సామర్థ్యం వివరాలను సేకరించాలని కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ నీరజను ఆదేశించారు. గ్యాస్ సరఫరా కంటే ముందు కిరోసిన్ను వంట ఇంధనం కోసం వాడేవారని, అందుకు సంబంధించిన కిరోసిన్ స్టౌల డేటా కూడా సిద్ధంగా ఉంచాలని సూచించారు.
శ్రీగిరికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వేకువజామున పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూ లైన్లలో బారులుదీరారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండి పోయాయి. క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, అల్పాహారం, బిస్కెట్లు దేవస్థాన అధికారులు పంపిణీ చేశారు. భక్తుల శివ నామ స్మరణతో శ్రీశైల ఆలయం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కళకళలాడుతున్నాయి.
క్వింటా వేరుశనగ రూ.8,070
ఎమ్మిగనూరుటౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్కు ఆదివారం వేరుశనగ దిగుబడులు 2,348 క్వింటాళ్లు విక్రయానికి వచ్చాయి. దీంతో క్వింటం వేరుశనగ గరిష్టంగా రూ.8,070 ధర పలికిందని మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జి.చంద్రమౌళి తెలిపారు. కనిష్ట ధర క్వింటా రూ.3,481, మధ్యస్థ ధర క్వింటా రూ.6,970 పలికినట్లు వెల్లడించారు. అదేవిధంగా ఆముదాలు 121 క్వింటాళ్లు విక్రయానికి రాగా కనిష్ట ధర క్వింటా రూ.5,483, గరిష్ట ధర రూ.5,974, కందులు 8 క్వింటాళ్లు విక్రయానికి రావడంతో క్వింటా కనిష్ట ధర రూ.4,230, గరిష్ట ధర రూ.6,720 పలికింది.


