ఆస్తి కోసం చిన్నాన్ననే చంపేశారు
● రోకలిబండతో బాది చంపిన అన్న కుమారులు ● నిందితులకు రిమాండ్
ఆళ్లగడ్డ: ఆస్తి కోసం సొంత చిన్నాన్ననే ముగ్గురు అన్నదమ్ములు రోకలిబండతో బాది అతిదారుణంగా చంపారు. శిరివెళ్ల మండలం వనికెందిన్నె గ్రామంలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు చిటికెల వెంకటేశ్వర్లు భార్య కుమారి కొంతకాలం క్రితం మృతి చెందింది. దీంతో అప్పటికే భర్తను కోల్పోయిన వదిన మరియమ్మతో ఆయన సహజీవనం చేస్తున్నాడు. పిల్లలు లేకపోవడంతో వెంకటేశ్వర్లు మరియమ్మ పిల్లల బాగోగులు చూసుకుంటూ తనదగ్గరున్న సొమ్ములు, వచ్చిన ఆదాయం అంతా వారికే ఖర్చు చేసేవాడు. తమ్ముడు హుస్సేని కుటుంబానికి ఎటువంటి సహాయం చేసేవాడు కాదు. దీనికి తోడు తన పేరు మీద ఉన్న ఇల్లు కూడా మరియమ్మ పిల్లలకే రాసిస్తున్నారన్న సమాచారం తెలిసింది. దీంతో చిన్నాన్న వెంకటేశ్వర్లును చంపితే ఇల్లు అయినా తమకు దక్కుతుందని హుస్సేని కొడుకులు చిటికెల దస్తగిరి, చిటికెల పెద్ద పక్కీరయ్య, చిటికెల రాముడు భావించారు. పథకం ప్రకారం ఈ నెల 13వ తేది రాత్రి చిన్నాన్న వెంకటేశ్వర్లు ఇంట్లో జొరబడి నిద్రపోతున్న అతడిని రోకలి బండతో మోది హత్య చేశారు. అనంతరం బీరువాలో ఉన్న రూ 50 వేల నగదు తీసుకుని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు అనుమానం వచ్చేలా అక్కడ ఎటువంటి ఆధారాలు లేకుండా చేసి వెళ్లి పోయారు. అనుమానాస్పద హత్య కేసుగా నమోదు చేసుకున్న శిరివెళ్ల పోలీసులు అన్ని రకాలుగా విచారణ జరిపి ఆధారాలు సేకరించడంతో నిందితులు మృతుడి తమ్ముడి కుమారులే అని తేలింది. దీంతో వీఆర్వో మూలపాటి రవీంద్రరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మంగళవారం నిందితులైన దస్తగిరి, పెద్దపక్కీరయ్య, రాముడులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి వారి నుంచి రెండు రోకలిబండలు, రూ 30 వేల నగదు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పరచగా రిమాండ్కు తరలించడం జరిగిందని డీఎస్పీ ప్రమోద్ తెలిపారు.


