ఆల్బెండజోల్ మాత్రలతో నులిపురుగుల నివారణ
కర్నూలు సిటీ: జిల్లాలో జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని 1 నుంచి 19 ఏళ్ల వయస్సు పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి తెలిపారు. మంగళవారం నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మెమోరియల్ హైస్కూల్లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నులిపురుగుల నివారణకు గ్రామీణ ప్రాంతాల్లో అవగాహనకు విస్త్రృత ప్రచారం చేస్తున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు తీసుకునే విధంగా చొరవ చూపాలన్నారు. ఈ విద్యా సంవత్సరం పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచాలని, పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు లక్ష్య సాధనపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆడ పిల్లలు తమ కాళ్ల మీద నిలబడిన తరువాతే వివాహం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భాస్కర్, సీ్త్ర, శిశు సంక్షేమ పీడీ విజయ, కార్పొరేటర్ కె.పద్మలత, డీఈఓ ఆఫీస్ ఏడీ అసుదుల్లాఖాన్, తదితరులు పాల్గొన్నారు.


