● అధికారాన్ని అడ్డుపెట్టుకున్న టీడీపీ నాయకులు ● స్థలాన్
దౌర్జన్యంగా కబ్జాల పర్వం
సాక్షి టాస్క్ఫోర్స్: అధికారంలో ఉన్నాం.. ఏం చేసినా తమను ఎవరూ ఏమీ అనబోరని టీడీపీ నాయకులు బరితెగించారు. కోడుమూరులోని సర్వే నంబర్ 103లో ఉన్న రస్తా పరంబోకు స్థలాన్ని కబ్జా చేశారు. టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్ దర్జాగా కబ్జా చేసి షాపు నిర్మాణాన్ని చేపట్టాడు. గత నాలుగైదు రోజుల నుంచి స్థలాన్ని కబ్జా చేసి షాపు నిర్మాణం చేపడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కోడు మూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి చిన్నబోయ వీధి లోని ఆంజనేయస్వామి ఆలయం వరకు ప్రధాన రోడ్డు వెంట రస్తా పరంబోకు స్థలం ఉంది. ప్రస్తుతం ఈ స్థలం కోట్లాది రూపాయల విలువ పలుకుతోంది. అయితే అధికారులు స్థలాన్ని పట్టించుకోకుండా వదిలేయడంతో టీడీపీకి చెందిన మాజీ సర్పంచులిద్దరితో పాటు మరికొందరు వ్యక్తులు ఆ స్థలాన్ని కబ్జా చేశారు. ఇప్పటికే కొందరు వ్యక్తులు పరంబోకు స్థలంలో శాశ్వత నిర్మాణాలు చేపట్టగా, మరికొందరు తాత్కలిక నిర్మాణాలు చేపట్టారు. ఇంతా జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహారిస్తున్నారు. గతంలో రెవెన్యూ, గ్రామ పంచాయతీ అధికారులు రస్తా పరంబోకు స్థలాన్ని సర్వే చేసి కబ్జాకు పాల్పడిన వారికి నోటీసులు సైతం జారీ చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు రస్తా స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. కొందరు వ్యక్తులు ఏకంగా దుకాణాలను నిర్మించి అద్దెలకు సైతం ఇచ్చారు. ఇకనైనా అధికారులు స్పందించి కబ్జాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని కబ్జాకు గురవుతున్నా రస్తా పరంబోకు స్థలాన్ని కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
● అధికారాన్ని అడ్డుపెట్టుకున్న టీడీపీ నాయకులు ● స్థలాన్


