నీచ రాజకీయాలు మానుకో
బీజెపీ అగ్రనాయకత్వం ఎందుకు మాట్లాడటం లేదో తెలుసుకో
వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి
చంద్రబాబూ.. దేవుళ్ల పేరుతో
కర్నూలు(టౌన్): రెండేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కనపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దేవుళ్ల పేరుతో చేస్తున్న నీచ రాజకీయాలు మానుకోవాలని వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి హితవు చెప్పారు. కర్నూలులో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల లడ్డూపై చంద్రబాబు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాడని విమర్శించారు. సీబీఐ నిగ్గుతేల్చినా ఇంకా జంతువుల కొవ్వు, పందికొవ్వు, ఫిష్ నూనె అంటూ హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. తిరుమల లడ్డూపై అడ్డంగా దొరికిపోవడంతో ఇప్పుడు శ్రీశైల శైవక్షేత్రం మల్లన్న ఆలయంలో టాయ్లెట్లు క్లీన్చేసే కెమికల్స్ వాడినట్లు చంద్రబాబునాయుడు చెప్పడం దారుణమన్నారు. ‘తిరుమల లడ్డూ, శ్రీశైలం లడ్డూ తిన్న భక్తులు ఎంతమంది ఆస్పత్రి పాలయ్యారు? అలాంటి కెమికల్స్ కలిపితే చనిపోతారు కదా.. ఎంతమంది చనిపోయారు. కనీస జ్ఞానం లేకుండా హిందువులను అవమానించడం ఏమిటి? ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని అబద్ధాన్ని పదేపదే చెప్పడం చంద్రబాబు నైజం. 2024 జూన్ 21 నుంచి 25 వరకు నెయ్యి ట్యాంకర్లు తెప్పించింది మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. జూలైలో 6వ తేదీ, 12వ తేదీన ట్యాంకర్లు వచ్చాయి. అనుమతులిచ్చింది మీ హయంలోనా.. జగనన్న హయంలోనా? వయసు రీత్యా చంద్రబాబుకు మతిమరపు వచ్చింది. తిరుమల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తొక్కిసలాట, సింహాచలంలో తొక్కిసలాట, రెండురోజుల కిందట శ్రీశైలంలో భక్తులపై లాఠీచార్జీ వంటి ఘటనలు ఈ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. విజయవాడలో రహదారుల విస్తరణ పేరుతో 40 ఆలయాలను కూల్చేసిన ఘనత చంద్రబాబుదే.
డైవర్షన్ పాలిటిక్స్ అని ప్రజలకు అర్థమైంది
పవిత్ర తిరుమల, శ్రీశైలం ప్రసాదాలపై ఆరోపణలు సిగ్గుచేటు
రాష్ట్రంలో ఇంత రాద్ధాంతం చేస్తున్నా బీజేపీ రాష్ట్ర నాయకత్వం, అగ్రనేతలు ప్రధాని మోదీ, అమిత్ షా, మోహన్భగవత్ ఎందుకు స్పందించడం లేదో చంద్రబాబుకు అర్థం కావడం లేదా? వాస్తవాలు తెలుసు కాబట్టే వారు నోరు మెదపడం లేదు. ఇదంతా మంత్రి లోకేశ్ను ముఖ్యమంత్రిని చేయాలనే చంద్రబాబు కుట్రగా తెలుస్తోంది. వైఎస్సార్సీపీకి, జగనన్నకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణపైన, విద్యుత్ చార్జీల పెంపుపైన, రైతన్నను ఆదుకోవాలంటూ చేపట్టిన ప్రజా ఉద్యమాలతో చంద్రబాబు ప్రభుత్వం దిగి వచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంగా ప్రజా ఉద్యమాలతో మమేకమైన వైఎస్సార్సీపీని ఇబ్బందులు పెట్టా లనే ఉద్దేశంతో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని విమర్శించారు. ఇవి డైవర్షన్ పాలిటిక్స్ అని ప్రజలందరికి అర్థమైందని ఆయన చెప్పారు. సమావేశంలో పార్టీ నేతలు షరీఫ్, నరసింహులుయాదవ్, పాటిల్ తిరుమలేశ్వరరెడ్డి, కార్పొరేటర్లు కృష్ణకాంత్రెడ్డి, షాషావలీ, పత్తాబాషా, రాజశేఖర్ పాల్గొన్నారు.


