భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలం
మంత్రాలయం ఎమ్మెల్యే
మంత్రాలయం రూరల్ : శ్రీశైలంలో భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే వై.బాల నాగిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్ నుంచి ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. శివరాత్రి పండుగను పురస్కరించుకుని శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు శివమాల ధిరించి ఇరుముడితో వస్తుంటారన్నారు. ముందస్తు ప్రణాళిక లేకుండా సౌకర్యాలు కల్పించకపోవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారన్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో రద్దీ పెరిగిపోయిందన్నారు. అటవీశాఖ, దేవస్థానం అధికారులు ముందుగానే చర్చించి ఈ నెల1వ తేదీ నుంచి శివస్వాములకు అనుమతి ఇచ్చింటే ఈ ఇబ్బందులు వచ్చేవి కాదన్నారు. ఇటీవల ఎమ్మిగనూరు మండలం కల్లుగొట్ల గ్రామంలో పర్యటించిన సీఎం చంద్రబాబు నాయుడు శ్రీశైలం లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారని మాట్లాడడం పద్ధతి కాదన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. టీటీడీ తరహాలో క్యూలైన్లలో ఉండే భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేయాలని కోరారు. భక్తులకు మరుగుదొడ్లు ఏర్పాటు చేయడమే కాకుండా స్నానాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. తిరుమల, శ్రీశైలంలో కల్తీ లడ్డూ అంటూ దుష్ప్రచారం చేస్తున్న ‘కూటమి’ నాయకులు వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వై. బాలనాగిరెడ్డి


