భృంగి వాహనాధీశా.. పాహిమాం
శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల శోభతో శ్రీగిరి క్షేత్రం ఇల కై లాసాన్ని తలపిస్తోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లు భృంగి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా భృంగి వాహనాన్ని పలు సుగంధ పుష్పాలతో అలంకరించారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను భృంగి వాహనంపై ఉంచి అలంకార మండపంలో అర్చకులు, వేదపండితులు వేదమంత్రోచ్ఛరణతో ప్రత్యేక పూజా హారతులిచ్చారు. అనంతరం భృంగివాహనాధీశులైన స్వామిఅమ్మవార్లకు దేవస్థాన చైర్మన్ పోతుగుంట రమేష్నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు నారికేళాలు సమర్పించారు. పరి వార దేవతామూర్తులకు కర్పూర నీరాజనాలు సమర్పించుకుంటూ ఉత్సవాన్ని ఆలయం వెలుపలకి తోడ్కొనివచ్చారు. కళాకారుల ప్రదర్శనలు కొనసాగుతుండగా.. మరో వైపు భక్తుల శివన్మామస్మరణతో పరమేశ్వరుడి పరమ భక్తుడైన భృంగి పులకించిపోయారు. వేలాది మంది భక్తులు భృంగివాహనాధీశులైన స్వామిఅమ్మవార్ల దివ్య మంగళస్వరూపాన్ని దర్శించి దీవెనలిమ్మని వేడుకున్నారు.
ఆకట్టుకున్న కళాకారుల ప్రదర్శన..
ఉత్సవంలో కళాకారుల ప్రదర్శన భక్తులను ఆకట్టుకున్నాయి. కళాకారుల నృత్యాలు, కోలాటాలు, నాదస్వరం, చెక్కభజనలు, రాజభటుల వేషాలు, కేరళ చండీమేళం, కొమ్ముకొయ్య నృత్యం, ముంభాయ్ ఢోల్ థాషా, మహిళా, పురుషుల వీరగాసి కన్నడ జానపద కళా ప్రదర్శనలు అలరించాయి. కాళికా నృత్యం, జాంజ్పథక్, జానపద పగటి వేషాలు, గొరవయ్యలు, డప్పుల నృత్యాలు, బుట్టబొమ్మలు, తప్పె ట చిందు, బీరప్పడోలు, నందికోలసేవ భక్తులను ఆకట్టుకున్నాయి.
శ్రీశైలంలో నేడు..
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు మంగళవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లు హంస వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం ఆలయ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహిస్తారు. అలాగే విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం వారిచే శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
భృంగివాహనంపై
ఆదిదంపతుల విహారం
స్వామిఅమ్మవార్లను దర్శించుకుని
తరించిన భక్తజనం
శ్రీగిరిలో వైభవంగా సాగుతున్న
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
నేడు హంసవాహన సేవలో
స్వామిఅమ్మవార్ల దర్శనం
భృంగి వాహనాధీశా.. పాహిమాం


