బాబూ.. ఇది మహాపాపం!
● శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పాలి
● మంత్రాలయం ఎమ్మెల్యే
వై. బాలనాగిరెడ్డి
మంత్రాలయం రూరల్: తమ రాజకీయ లబ్ధి కోసం పవిత్రమైన తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ప్రకటనలు ఇస్తూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మహా పాపం చేశారని, శ్రీవారి భక్తులకు వారు వెంటనే క్షమాపణలు చెప్పాలని మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి అన్నారు. మంత్రాలయం మండలం రాంపురం గ్రామంలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కలియుగదైవమైన శ్రీ వెంకటేశ్వరస్వామి లడ్డూలో కల్తీ జరిగిందని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదానికి సీఎం చంద్రబాబు చేసింది ఘోర అపచారం అన్నారు. కేవలం రాజకీయ స్వార్థం కోసమే దుష్ప్రచారానికి పాల్పడ్డారన్నారు. లడ్డూలో కల్తీ జరగలేదని కోర్టు నివేదిక ఇవ్వడంతో రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించేందుకు అంబటి రాంబాబు పై దాడి పాల్పడి అక్రమ అరెస్టులతో తెరలేపారన్నారు. విజయవాడ వరదల్లో సహాయ, పునరావాస చర్యల్లో తన ఘోర వైఫల్యం నుంచి ప్రజలను దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ రాజకీయాల కోసమే ఈ మహా పాపానికి ఒడిగట్టారన్నారు. తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని వేదికగా చేసుకుని, స్వామివారి ప్రసాదాన్నే ఆయుధంగా మార్చిన చంద్రబాబు నాటకం పూర్తిగా భగ్నమైందన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో దేశంలోనే ప్రముఖమైన ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబ్లు చేసిన పరీక్షల్లో చంద్రబాబు ఆరోపించినట్టుగా ఎలాంటి జంతువుల కొవ్వు లేదని తేలిందన్నారు. తిరుమల లడ్డూ విషయంలో వేసిన నిందలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడు సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తిరుమల ఆలయానికి తెచ్చిన అప్రతిష్టకు ఏ మూల్యం చెల్లిస్తారన్నారు. రాజకీయాల కోసం టీడీపీ నేతలు చివరకు దేవుడినీ వదలబోరని తిరుమల లడ్డూ వ్యవహారంలో రుజువైందన్నారు. శ్రీవారి భక్తులకు సీఎం చంద్రబాబునాయుడు కచ్చితంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.


