వైభవంగా స్వాతి వేడుకలు
ఆళ్లగడ్డ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీమద్ అహోబిలం క్షేత్రంలో స్వాతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి వేడుకలు పురస్కరించుకుని ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో నల్లమల పులకించి పోయింది. ఈ సందర్భంగా దిగువ అహోబిలంలో ఏర్పాటు చేసిన యాగశాలలో ఉత్సవమూర్తులైన పావన లక్ష్మీనృసింహ స్వామిని, సుదర్శనమూర్తులను కొలువుంచి పంచామృతాలతో అభిషేకించారు. నవకళశాలతో తిరుమంజనం నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తులను నూతన పట్టుపీతాంబరాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వేద పండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య శ్రీ స్వాతి, శ్రీసుదర్శన హోమాలు వైభవోపేతంగా నిర్వహించారు. పూర్ణాహుతితో కార్యక్రమాన్ని ముగించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలు ప్రధానార్చకులు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
వైభవంగా స్వాతి వేడుకలు


