మిమ్మల్ని దేవుడు కూడా క్షమించడు
● సీబీఐ తేల్చినా మళ్లీ ఏక సభ్య కమిషనా?
● తప్పు చేశారు, ఇకనైన నోరు మూసుకోండి
● ఏ ఆధారాలతో శ్రీశైలం ప్రసాదంపై ఆరోపణలు
● జగనన్నను డ్యామేజ్ చేయాలనుకోవడం మీ మూర్ఖత్వం
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి
కర్నూలు(టౌన్): ‘‘అత్యున్నత సీబీఐ నిగ్గు తేల్చింది. ప్రజలందరికీ అర్థమైంది. మళ్లీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురూ తిరుమల లడ్డూ గురించి మాట్లాడుతున్నారు. ఇంకెన్నాళ్లీ రాజకీయం చేస్తారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంట్లో సొంత మనిషి చనిపోతే మూడు రోజుల తరువాత ముఖాలు ఎలా ఉంటాయో.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డిల ముఖాలు అలానే ఉన్నాయన్నారు. పవిత్ర తిరుమల లడ్డూ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఇరికించాలని చంద్రబాబు అడ్డంగా బుక్కయ్యారన్నారు. హిందూ వ్యతిరేకిగా జగనన్నను చేయాలనుకోవడం వారి మూర్ఖత్వమన్నారు. ఇప్పటికే తప్పు చేశారని, ఇకనైనా మరింత పరువు పోకుండా నోరు మూసుకోవాలని సలహా ఇచ్చారు. కింద పడినా తామే గెలిచామన్న రీతిలో మళ్లీ ఏకసభ్య కమిషన్ దర్యాప్తు అనడం సిగ్గుచేటన్నారు. తిరుమల పవిత్రను దెబ్బతీయాలనుకుంటే ఆ భగవంతుడు కూడా క్షమించబోడన్నారు. విజయవాడలో 40 గుళ్లను కూల్చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. జగనన్న హయాంలో తిరుమలలో గోవులను కాపాడేందుకు ప్రత్యేకంగా గోశాల ఏర్పాటు చేశారని, అర్చకుల జీతాలు, కార్మికుల వేతనాల పెంపు, తిరుమలలో 9వేల మందికి ఇళ్ల పట్టాలు, అమరావతి, హైదరాబాద్, వైజాగ్, జమ్ముకశ్మీర్, భువనేశ్వర్లలో వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిదేనన్నారు.
శ్రీశైలం ప్రసాదంపై ఆరోపణలు దారుణం
పవిత్ర పుణ్యక్షేత్రంలో శ్రీశైల మల్లన్న భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దారుణమైన ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ఎస్వీ అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఏ ఆధారాలతో శ్రీశైలంపై ఆరోపణలు చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. శ్రీశైలంలో భక్తులకు ఇచ్చే ప్రసాదంలో టాయిలెట్లు క్లీనింగ్ చేసే కెమికల్ వాడుతున్నారని చంద్రబాబు ఎలా ప్రకటించారన్నారు. ఏమైనా ల్యాబ్ రిపోర్టు ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు వయస్సు రీత్యా మతి చెడిందన్నారు. కూటమి పాలన వైఫల్యంతోనే ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు.


