క్రమశిక్షణ అలవర్చుకోండి
● కానిస్టేబుళ్ల
శిక్షణ ప్రారంభ కార్యక్రమంలో డీఐజీ
కర్నూలు: ఇప్పటివరకు మీరు సాధారణ పౌరులు (సివిలియన్స్).. ఇకపై పోలీస్ కుటుంబంలోకి అడుగు పెడుతున్నందున ప్రవర్తన, మాట తీరు మార్చుకోవడమే కాకుండా క్రమశిక్షణ అలవర్చుకోవాలి. పోలీసు శాఖలో క్రమశిక్షణే ప్రధానమని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ అన్నారు. స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ (ఎస్సీటీ) పోలీసు కానిస్టేబుళ్ల శిక్షణ ఏపీఎస్పీ కర్నూలు రెండో పటాలంలో సోమవారం ప్రారంభమైంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 633 మంది స్టైఫండరీ కానిస్టేబుళ్లు 9 నెలల పాటు ఇక్కడ ప్రాథమిక శిక్షణ పొందనున్నారు. ప్రారంభ కార్యక్రమానికి కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బెటాలియన్ కమాండెంట్ శిక్షణ కళాశాల నిర్వహణకర్త దీపిక పాటిల్, అదనపు కమాండెంట్ నాగేంద్రరావు, అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, తదితరులు డీఐజీకి పూలబొకే ఇచ్చి స్వాగతం పలికారు. పటాలం శిక్షణ కేంద్రంలో 437 మంది, అలాగే కర్నూలు శివారులోని జగన్నాథగట్టుపై ఉన్న పోలీసు శిక్షణా కేంద్రంలో 209 మంది కలిపి మొత్తం 646 మందికి కమాండెంట్ దీపిక పాటిల్ పర్యవేక్షణలో శిక్షణ కొనసాగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో డీఐజీ పలు విషయాలపై నూతన కానిస్టేబుళ్లకు అవగాహన కల్పించారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు శిక్షణ ఉంటుందని, క్రమశిక్షణతో తరగతులను పూర్తి చేసుకోవాలని సూచించారు.


