పెరిగిన చలి
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. మంచు కూడా కురుస్తోంది. ఇప్పటికే గరిష్ట ఉష్ణోగ్రతలు 15–16 డిగ్రీలకు పడిపోయాయి. ఉదయం 8 గంటల వరకు చలి తగ్గని పరిస్థితి నెలకొంది. చలి తీవ్రతతో అలర్జీ, అస్తమా, ఊపిరితిత్తుల సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ నెల 11 నుంచి చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈశాన్యం దిశగా గాలులు గంటకు 3 నుంచి 4 కిలో మీటర్ల వేగంతో విస్తాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల వరకు, కనిష్ట ఉష్ణోగ్రతలు 16.17 డిగ్రీల వరకు నమోదు అవుతాయని ప్రకటించారు.
రోడ్ల అభివృద్ధ్దికి
పాలనా అనుమతులు
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో రూ.156.64 కోట్లతో 71 పనులను చేపట్టేందుకు పాలనా అనుమతులు మంజూరైనట్లు పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజనీరు వేణుగోపాల్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాలో 115.409 కిలో మీటర్ల మేర రోడ్లను అభివృద్ది చేసేందుకు రూ.62.67 కోట్లతో 27 పనులు మంజూరైనట్లు చెప్పారు. అలాగే నంద్యాల జిల్లాలో 178.110 కిలో మీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేసేందుకు రూ.93.97 కోట్లతో 44 పనులను చేపట్టేందుకు పాలనా అనుమతులను మంజూరు చేస్తు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఉమ్మడి జిల్లాలో పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరిన రోడ్లను అభివృద్ధి చేసేందుకు వీలుగా ప్రతిపాదనలను పంపించడం జరిగిందన్నారు. ఈ ప్రతిపాదనల మేరకు ఆయా రోడ్లను అభివృద్ధి చేసేందుకు అనుమతులు వచ్చాయని ఎస్ఈ వివరించారు. త్వరలోనే రెండు జిల్లాల్లో పాలనా అనుమతులు లభించిన రోడ్ల పనులను ప్రారంభించేందుకు చర్యలు చేపడతామన్నారు.
కర్నూలు(సెంట్రల్): ప్రసూతి మరణాలను పూర్తిగా తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం ఆమె తన చాంబరులో వైద్యశాఖకు సంబంధించిన కీలక పనితీరు సూచికలు (కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్)లపై వైద్యాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కీలక పనితీరు సూచికలను సాధించడంలో వంద శాతం పురోగతి కనిపించాలన్నారు. గర్భిణులకు అందించే యాంటి నేటల్ కేర్ (ఎన్ఏసీ)సేవలు తప్పనిసరిగా అందేలా చూడాలన్నారు. ప్రతి గర్భిణి వివరాలను రిజిస్టర్ చేసి నిర్ణీత కాలపట్టిక ప్రకారం సకాంలో ఆరోగ్య పరీక్షలు, అవసరమైన రక్త పరీక్షలు, హిమోగ్లోబియన్ స్థాయి, బీపీ, బరువు, టీకాలు, పోషకాహారానికి సంబంధించిన సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. శిశు మరణాల శాతాన్ని కూడా పూర్తిగా తగ్గించాలని ఆదేశించారు. అంటు వ్యాధులతో మరణాలతో తగ్గించడం, సకాలంలో వైద్య సేవలు అందించడం కోసం వైద్యాధికారులు కృషి చేయాలన్నారు. విలేజ్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు, విద్యుత్, నీటి సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యుత్, పంచాయతీ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సీపీఓ భారతి, డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కరరాజు, డీసీహెచ్ఎస్ డాక్టర్ జఫ్రూల్లా, ఏఓ సింధు సుబ్రమణ్యం పాల్గొన్నారు.
నేడు ‘డయల్ యువర్ ఎస్ఈ’
కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ భవన్లో ఈ నెల 10 తేదీన డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్ఈ ఆర్.ప్రదీప్కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించే కార్యక్రమానికి వినియోగదారులు తాము ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను 7382614308 నంబర్ ఫోన్ చేసి చెప్పవచ్చని పేర్కొన్నారు.
మంచాలమ్మ దేవరకు స్థల పరిశీలన
మంత్రాలయం: గ్రామ దేవత మంచాలమ్మ దేవర సంబరాల నిమిత్తం స్థల పరిశీలన చేపట్టారు. మంగళవారం గ్రామస్తులు శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులతో కలిసి ఉత్సవ స్థలం పరిశీలించారు. పూర్వం మంచాలమ్మ ఆలయం అభిముఖంగా గ్రామస్తులు దేవర చేసుకుంటూ వచ్చారు. ప్రస్తుతం సుజయీంద్ర నగర్ ప్రాంతంలో వేడుక చేసుకోవడానికి స్థలం చూశారు. స్వామిజీ, సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, ఉప సర్పంచ్ హోటల్ పరమేష్, మాజీ సర్పంచ్ పన్నగ వెంకటేశ్వర్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
పెరిగిన చలి


