
ఇంటర్ విద్యార్థి బలవన్మరణం
డోన్ టౌన్: బీసీ బాలుర కళాశాల వసతి గృహంలో ఉంటున్న ఇంటర్ విద్యార్థి శ్యాంసుందర్ (16) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పట్టణ సీఐ ఇంతియాజ్బాషా తెలిపిన వివరాల మేరకు.. అనంతపురం జిల్లా యాడికికి చెందిన చేనేత కార్మికులు రమేష్, సావిత్రి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శ్యాంసుందర్ డోన్ పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల స్వగ్రామానికి వెళ్లిన విద్యార్థి ఆదివారం తిరిగి వసతి గృహానికి చేరుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున బాత్ రూంలో శ్యాంసుందర్ ఉరేసుకుని కనిపించాడు. ఉదయం కాలకృత్యాల కోసం బాత్రూంకు వెళ్లిన విద్యార్థులు గమనించి హాస్టల్ వార్డెన్ మేరీ సూర్యకుమారి, విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న సీఐ ఇంతియాజ్బాషా, ఎస్ఐలు శరత్కుమార్ రెడ్డి, నరేంద్రకుమార్, ఆర్డీఓ నరసింహులు, సాంఘిక సంక్షేమశాఖ అధికారులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. అనంతరం తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కాగా విద్యార్థి మృతిపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, బీజేపీ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమగ్ర దర్యాప్తు చేపట్టాలని హాస్టల్ ఎదుట ఆందోళన చేశారు. అన్ని కోణాల్లో విచారించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడతామని సీఐ తెలిపారు.
తల్లి మందలించిందని కుమారుడి ఆత్మహత్య
కోడుమూరు రూరల్: చెడు అలవాట్లకు బానిస కావొద్దు అని తల్లి మందలించడంతో కుమారుడు భాస్కర్ (22) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన కోడుమూరులోని బీసీ కాలనీలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. భాస్కర్ చిన్న చిన్న వయసులో ఉన్నప్పుడే తండ్రి రాముడు మృతి చెందాడు. దీంతో తల్లి కమలమ్మ కూలి పనులు చేసుకుంటూ ఒక్కగానొక్క కుమారుడిని పెంచారు. భాస్కర్ కూడా గౌండా పనిచేస్తూ తల్లికి చేదోడువాదోడుగా ఉండేవాడు. ఇటీవల భాస్కర్ చెడు అలవాట్లు బానిసై మద్యం తాగుతుండడంతో తల్లి కమలమ్మ మందలించింది. దీంతో మనస్తాపం చెందిన కుమారుడు భాస్కర్ సోమవారం ఉదయం తమ నివాసం పక్కనే ఉన్న మరో గుడిసెలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందాడని తెలిసి తల్లి కమలమ్మ శోకసంద్రంలో మునిగిపోయారు. కోడుమూరు పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇంటర్ విద్యార్థి బలవన్మరణం