
మెనూ పాటించకపోతే చర్యలు తప్పవు
కర్నూలు(అర్బన్): జిల్లాలోని ప్రభుత్వ బీసీ సంక్షేమ వసతి గృహాల్లో మెనూ పాటించకపోతే చర్యలు తప్పవని జిల్లా బీసీ సంక్షేమం, సాధికారత అధికారిణి కె.ప్రసూన హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం ఆమె నగరంలోని రెండు బీసీ కళాశాల బాలికల వసతి గృహాలు, ఒక ప్రీ మెట్రిక్ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా వసతి గృహాల్లోని పరిసరాలను పరిశీలించి మరింత శుభ్రంగా ఉంచుకోవాలని వసతి గృహ సంక్షేమ అధికారులను ఆదేశించారు. అలాగే వంట గది, స్టోర్ రూమ్ను తనిఖీ చేసి విద్యార్థుల కోసం వండిన వంటకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని పలు హాస్టళ్లలో మెనూ సక్రమంగా పాటించడం లేదనే ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. తాను చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో ఎక్కడైనా విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా వసతి గృహాల్లోని విద్యార్థినులతో హాస్టళ్లలో అందుతున్న సౌకర్యాలపై ప్రత్యేకంగా ఆరా తీశారు.
సమైక్యతను చాటారు.. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి
● జిల్లా ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి
కర్నూలు: కర్నూలు, ఆదోనిలో గణేశ్ నిమజ్జన వేడుకల సందర్భంగా సమైక్యతను, సమగ్రతను చాటి చెప్పారని, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా భవిష్యత్తులో కూడా జిల్లా ప్రజలు ఇదే స్ఫూర్తిని కొనసాగించి పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ విజ్ఞప్తి చేశారు. జిల్లా ప్రజలు, మత పెద్దలు, రాజకీయ పార్టీలు, గణేశ్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు, యువత, మీడియాకు ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. సమాజ కర్తవ్యం, అంకిత భావంతో నిమజ్జన బందోబస్తు విధుల్లో పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.
‘ఫారెస్ట్’ పోస్టుల భర్తీకి
రేపు స్క్రీనింగ్ టెస్ట్
కర్నూలు (సెంట్రల్): ఫారెస్ట్ శాఖలోని అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఆదివారం స్క్రీనింగ్ టెస్ట్ను నిర్వహిస్తున్నట్లు డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ తెలిపారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఏపీపీఎస్సీ నిర్వహించే అటవీ శాఖ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆయా పరీక్షల కోసం జిల్లాలో 33 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉదయం అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పరీక్షలు 10 నుంచి 12:30 గంటల వరకు, మధ్యాహ్నం సెక్షన్ ఆఫీసర్ పోస్టుకు సంబంధించిన పరీక్షను 3 నుంచి 5:30 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఆధార్ కార్డు, లేదంటే ఏదైనా గుర్తింపు కార్డులను హాల్టిక్కెట్తో పాటు తెచ్చుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని 15 నిమిషాలకు ముందుగానే సూచించారు. పరీక్ష కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోరన్నారు.
పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల పెంపు
జూపాడుబంగ్లా: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంచి నీటి విడుదలను 30 వేల నుంచి 32 వేల క్యూసెక్కులకు పెంచినట్లు ఏఈ విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయంలోకి 1,16,422 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా డ్యాంలో 883.60 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు తెలిపారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ 2, 4, 5, 6,7 గేట్ల అడుగు మేర ఎత్తి 32 వేల క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీ కాల్వలోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ నీటిని బానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థ నుంచి తెలుగుగంగ కాల్వకు 13 వేల క్యూసెక్కులు, ఎస్సార్బీసీ (జీఎన్ఎస్ఎస్) కాల్వకు 13 వేలు, కేసీ ఎస్కేప్ కాల్వకు 6వేల క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు బానకచర్ల ఏఈ దేవేంద్ర తెలిపారు.

మెనూ పాటించకపోతే చర్యలు తప్పవు