
నేటి నుంచి పీజీ, బీటెక్ సెమిస్టర్ పరీక్షలు
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో సోమవారం నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీటెక్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. పీజీ నాల్గవ సెమిస్టర్ పరీక్షలు సోమవారం నుంచి ఈనెల 28వ తేదీ వరకు వర్సిటీ కళాశాల కేంద్రంలో జరుగుతాయన్నారు. 452 మంది రెగ్యులర్, 44 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు. బీటెక్ 4,6 సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ, 3,5,7 సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 31వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. 360 మంది రెగ్యులర్, 325 మంది సప్లిమెంటరీ పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.
8న పత్తికొండలో వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం
తుగ్గలి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పత్తికొండ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం ఈనెల 8వ తేదీన ఉదయం 10 గంటలకు గోపాల్ప్లాజా మందిరంలో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు జిట్టా నాగేష్ యాదవ్, మండల అధ్యక్షుడు అట్ల గోపాల్రెడ్డి ఆదివారం తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అధ్యక్షతన నిర్వహించనున్న సమావేశంలో ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ క్యూ ఆర్ కోడ్ ద్వారా డాక్యుమెంటరీ విడుదల చేయనున్నట్లు చెప్పారు. సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి, పార్లమెంట్ పరిశీలకులు గంగుల ప్రభాకరరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతారన్నారు. నియోజకవర్గంలోని పార్టీ నేతలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అభిమానులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
బ్రహ్మగుండంలో
సినిమా షూటింగ్
వెల్దుర్తి: పట్టణ సమీపంలోని కామేశ్వరీదేవి సమేత బ్రహ్మగుండం క్షేత్రంలో ఆదివారం సినిమా షూటింగ్ జరిగింది. ఆర్ఎస్ క్రియేషన్స్ సమర్పణలో వెల్దుర్తికి చెందిన రోబో సుధాకర్ దర్శకత్వంలో, దివాన్ వలి రచయితగా లద్దగిరి శివ హీరోగా, ముంబై చెందిన తేజల్ హీరోయిన్గా నటిస్తున్న ‘ఉంటే ఇలాగే ఉండాలి’ సినిమా గత 15 రోజులుగా ఓర్వకల్లు మండంలం చింతలపల్లిలో చిత్రీకరణ జరుగుతోంది. సినిమా సన్నివేశాల్లో భాగంగా హీరో, హీరోయిన్ల పెళ్లి సనివేశాన్ని దర్శకుడు ఆదివారం బ్రహ్మగుండం క్షేత్రంలో చిత్రీకరించారు. పెళ్లి సన్నివేశాల్లో మ్యాడ్ సినిమాలోని ఓ హీరోయిన్ సునీతా మనోహర్, సీరియల్ నటి స్వప్న జబ్బర్దస్త్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
శిలాఫలకాల ధ్వంసం
నంద్యాల(అర్బన్): నంద్యాల మండలం మిట్నాల గ్రామ సమీపంలో ఏర్పాటైన జగనన్న పాల వెల్లువ మహిళా డెయిరీ సహకార సంఘం భవనం ఏర్పాటు శిలా ఫలకం, మిట్నాల నుంచి గోస్పాడు మండలం జూలెపల్లె వరకు ఏర్పాటైన నిధులకు సంబంధించిన శిలాఫలకాలను ఆదివారం దుండగులు ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో రూ. 17.50 లక్షలతో ఏర్పాటైన పాల వెల్లువ శిలాఫలకం, రూ.1.25 కోట్లు పంచాయితీ రాజ్ నిధులతో ఏర్పాటైన బీటీ రోడ్డు శిలాఫలకాలను మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ప్రారంభించారు. శిలాఫలకాల ధ్వంసం వెనుక ‘కూటమి’ నేతల హస్తం ఉంటుందని స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు తిరుపతిరెడ్డి, గోపాల్రెడ్డిలు ఆరోపిస్తున్నారు. పోలీనులు పూర్తిస్థాయి విచారణ జరిపి ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు.

నేటి నుంచి పీజీ, బీటెక్ సెమిస్టర్ పరీక్షలు