శ్రీమఠంలో భక్తుల సందడి
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం భక్తులతో పోటెత్తింది. గురువారం ప్రత్యేకం కావడంతో రాఘవేంద్రస్వామి దర్శనార్థం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో రావడంతో మంత్రాలయ క్షేత్రం కిక్కిరిసింది. తుంగభద్ర నదికి వరద నీరు రావడంతో నదీతీరంలో భక్తుల కోలాహలం కనిపించింది. భక్తులు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ, ఆ తర్వాత రాఘవేంద్రుల మూల బృందావన దర్శనాలు చేసుకున్నారు. రాఘవేంద్రుల దర్శనానికి రెండున్నర గంటల సమయం పట్టింది. అన్నపూర్ణభోజనశాల, పరిమళ ప్రసాదం కౌంటర్లతో భక్తులు బారులు తీరారు.
9న విత్తనాల కోసం
ఆందోళన
కర్నూలు(సెంట్రల్): రైతులకు నాణ్యమైన విత్తనాలను 90 శాతం సబ్సిడీపై సరఫరా చేయాలని కోరుతూ జూన్ 9వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ కార్యాలయాల ఎదుట ఆందోళనలు నిర్వహించనున్నట్లు ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం తెలిపారు. గురువారం కర్నూలులోని సీఆర్ భవన్లో ఆందోళన కార్యక్రమానికి సంబంధించి వాల్ పోస్టర్లు ఆ సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సకాలంలో వర్షాలు పడినా విత్తనాలను అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఇవ్వకుండా జాప్యం చేయడం ప్రభుత్వానికి తగదన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పంపన్నగౌడ్ పాల్గొన్నారు.
గిరిజన సంక్షేమ అధికారిగా కొండయ్య
కర్నూలు(అర్బన్): జిల్లా గిరిజన సంక్షేమం, సాధికారత అధికారిగా శ్రీశైలం ప్రాజె క్టు స్పెషల్ కలెక్టర్ పీఏగా విధులు నిర్వ హిస్తున్న పి.కొండయ్యకు ఇన్చార్జి బాధ్య తలు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఈ శాఖకు జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా ఆర్థిక సహకార సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తులసి దేవి ఇన్చార్జ్గా వ్యవహరించారు.
డీఐఈఓకు ఆర్ఐఓ బాధ్యతలు
కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ జిల్లా వృత్తి విద్యాధికారిగా పని చేస్తున్న డా.సి. సురేష్ బాబును జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారిగా నియమిస్తూ బోర్డు కమిషనర్ కృతికా శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఇంటర్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి (ప్రస్తుతం ఈ పోస్టును డీఐఈఓగా మార్పు చేశారు)గా పని చేస్తున్న జీవీఎస్ గురువయ్య శెట్టి నుంచి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వివిధ కాలేజీలకు చెందిన ప్రిన్సిపాళ్లు లాలెప్ప, పరమేశ్వరరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు.
శ్రీశైలం డ్యాం నీటిమట్టం
835 అడుగులు
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయ నీటిమట్టం గురువారం సాయంత్రం సమయానికి 835 అడుగులకు చేరుకుంది. బుధవారం నుంచి గురువారం వరకు ఎగువ జూరాల, సుంకేసుల నుంచి 19,785 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు 4,598 క్యూసెక్కుల నీరు విడుదలైంది. కుడిగట్టు కేంద్రంలో 0.906, ఎడమగట్టు కేంద్రంలో 0.842 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. బ్యాక్ వాటర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు 867 క్యూసెక్కుల నీటిని వదిలారు. ప్రస్తుతం జలాశయంలో 55.0470 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
రద్దయిన రైళ్లను
పునరుద్ధరించాలి
కర్నూలు(సెంట్రల్): కరోనా సమయంలో రద్దయిన రైళ్లను పునరుద్ధరించాలని ఆందోళన చేపట్టనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జూన్ 7,8 తేదీల్లో సంతకాల సేకరణ, 9న రైల్వే స్టేషన్ల ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
శ్రీమఠంలో భక్తుల సందడి
శ్రీమఠంలో భక్తుల సందడి


